ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2021, 6:29 AM IST

ETV Bharat / city

పెరుగుతున్న కరోనా తీవ్రత.. తితిదే అప్రమత్తం

కరోనా తీవ్రత పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య తగ్గించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భక్తులను తితిదే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. నిరంతరం శానిటైజ్‌ చేస్తున్నారు. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలన్న నిర్ణయంపై తితిదే పునరాలోచనలో పడింది.

tirumala tirupati devasthanam
తిరుమలో ఆంక్షలు

పెరుగుతున్న కరోనా తీవ్రత..తితిదే అప్రమత్తం

రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాలో చిత్తూరు అగ్రభాగాన ఉంది. జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం తిరుపతి నగరంలో ఉండటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం.. వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తిరుపతి కేంద్రంగా జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల సంఖ్య తగ్గించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 20 నుంచి 25 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేసేవారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తిరుపతిలో జారీచేసే సర్వదర్శనం టోకెన్ల వద్ద గుమికూడటం వల్ల కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందని భావించిన తితిదే సర్వ దర్శనం టోకెన్ల సంఖ్యను 15వేలకు పరిమితం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్‌దర్శనం, శ్రీవాణి ట్రస్ట్‌, సుపథం ప్రవేశం ఇలా వివిధ రకాలుగా రోజుకు 55 నుంచి 60వేల మందిని దర్శనాలకు అనుమతిస్తుండగా.. ఆ సంఖ్యను 45 వేలకు పరిమితం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి క్యూలైన్ల వరకూ శానిటైజేషన్‌ తీవ్రం చేశారు. అలిపిరి టోల్‌ గేట్‌ వద్ద భక్తులను కిందకు దించి బస్సులను డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చేస్తున్నారు.


దర్శన టికెట్లు ఉన్న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలకు చేరుకొనేలా అలిపిరి టోల్‌గేట్‌, కాలినడక మార్గాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అన్నప్రసాద వితరణ, కల్యాణకట్ట, అద్దె గదుల కేటాయింపు ప్రాంతాల్లో.. కరోనా నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేప్టటారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రకటించారు. పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారితే ఏప్రిల్‌ నెలకు జారీచేసిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దర్శన టికెట్లు ఉన్న వారు 12 నుంచి 14 శాతం వరకు గైర్హాజరవుతున్నారని అదనపు ఈవో తెలిపారు.

తితిదే ఉద్యోగులందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తితిదే కోరుతోంది. ఇప్పటికే 3వేల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తైందని.. గురువారం నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా వేయనున్నట్లు తితిదే ఆరోగ్యాధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి
నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా

ABOUT THE AUTHOR

...view details