తమిళనాడులోని కోయంబేడుకు చెందిన బాబు... భార్య ఇందుమతి, ఇద్దరు కుమారులతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. కాలినడకన కొండకు చేరుకున్న ఆ కుటుంబం... కొంతసేపు విశ్రాంతి తీసుకుని కల్యాణి సత్రానికి చేరుకున్నారు. తండ్రితోపాటు ఇద్దరు కుమారులూ తలనీలాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రహదారిపైకి వచ్చారు. ఇంతలోనే... అటునుంచి వచ్చిన సుమో..వారిలో ఒకరిమీదకు దూసుకొచ్చింది. అసలేమవుతుందో తెలుసుకునేలోపే...చిన్న కుమారుడు లోకప్రసాద్..సుమో చక్రాల కింద నలిగిపోయాడు.
లోకప్రసాద్పైకి సుమో ఎక్కడంతో రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. తమ్ముడిని బతికించుకునేందుకు అన్న పడిన తాపత్రయం భక్తులను కలచివేసింది. కుమారుణ్ని భుజాలపై వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. లోకప్రసాద్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా కుటుంబసభ్యులు రోదించారు. తితిదే వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు.