ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2022, 9:12 PM IST

Updated : Mar 30, 2022, 3:19 PM IST

ETV Bharat / city

'జై భీమ్' సినిమా రిపీట్..హత్య కేసు ఆత్మహత్యగా చిత్రీకరణ..సీఐ, ఎస్​పై సస్పెన్షన్ వేటు !

'జై భీమ్' సినిమా చూశారా..! అందులో పాములు పట్టుకుని జీవించే రాజన్నను ఓ దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేస్తారు. పోలీసు స్టేషన్​లో చిత్రహింసలకు గురిచేయటంతో రాజన్న స్టేషన్​లోనే చనిపోతాడు. కట్‌ చేస్తే.. జైలు నుంచి రాజన్న తప్పించుకుపోయాడని భార్య సినతల్లికి చెబుతారు పోలీసులు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక అతని ఆచూకీ కోసం లాయర్‌ చంద్రును కలుస్తుంది సినతల్లి. లాయర్ చంద్రు కోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేయటంతో లాకప్​డెత్​ను యాక్సిడెంట్​గా చిత్రీకరించేందుకు ఎస్​ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇప్పుడీ కథంతా ఎందుకు చెబుతున్నానంటే.. అచ్చంగా ఇలాంటి స్టోరీనే చిత్తూరు జిల్లాలో జరిగింది. ఆస్థి కోసం సొంత అన్నను పొట్టన పెట్టుకొన్న నిందితులను కటకటాల వెనక్కు పంపాల్సిన పోలీసులు వారితోనే కుమ్మక్కయ్యారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు.

'జై భీమ్' సినిమా రిపీట్
'జై భీమ్' సినిమా రిపీట్

'జై భీమ్' సినిమా రిపీట్..హత్య కేసు ఆత్మహత్యగా చిత్రీకరణ

చిత్తూరు జిల్లాలో 'జై భీమ్' సినిమా రిపీట్ అయింది. సినిమాలో సినతల్లి లాగే ఇక్కడ కూడా తన భర్త మరణంపై ఓ భార్య పోరాటం చేసింది. రీల్ సినతల్లి లాయర్​ను ఆశ్రయిస్తే.. రియల్ సినతల్లి పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందింది. వివరాల్లోకి వెళితే.. అనుపల్లికి చెందిన కపిలేశ్వరయ్యకు ఉమాపతి, హేమ సుందర్‌, యదు భూషణ్‌ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి పేరున ఉన్న ఏడున్నర ఎకరాల పొలంలో తన భాగంగా రెండున్నర ఎకరాలు ఇవ్వాలని రెండో కుమారుడు హేమసుందర్‌ కోరాడు. సమస్యను పరిష్కరించుకుందామని.. అనుపల్లిలోని సోదరుడు ఉమాపతి ఇంటికి వెళ్లారు. దీనిపై చర్చ జరుగుతున్నప్పుడే.. తండ్రి, సోదరులు కలిసి హేమసుందర్‌ తలపై రోకలిబండతో కొట్టి చంపారు. హత్యను అనుమానాస్పద మృతిగా చిత్రీకరించేందుకు ఇంట్లోనే ఉరి వేశారు. చర్చలు జరుగుతున్నప్పుడు హేమసుందర్‌ ఆవేశంతో ఉరేసుకున్నాడని.. తాడు తెగి కిందపడటంతో తలకు గాయమై చనిపోయాడని...అతని భార్యకు సమాచారం ఇచ్చారు.

హత్య కేసు ఆత్మహత్యగా చిత్రీకరణ..

హేమసుందర్‌ మృతిపై అనుమానంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం సీఐ అమరనాథరెడ్డి, ఎస్‌.ఐ చిరంజీవితో పాటు ఓ కానిస్టేబుల్‌.... హత్య జరిగిన అనుపల్లిలోని ఉమాపతి ఇంటికి వెళ్లారు. రోకలిబండతో కొట్టిన ఆనవాళ్లు, తల పగలడంతో పాటు శరీరంపై ఇతర గాయాలున్నా ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. కేసును పక్కదారిపట్టిస్తున్నారని అనుమానించిన హేమసుందర్‌ భార్య.. స్పందన కార్యక్రమంలో అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మృతుడి శరీరంపై గాయాల చిత్రాలను అందించారు. ఫోటోలు, ఘటనా స్థలంలో మృతదేహం పడిన తీరు చూసిన ఎస్పీ విచారణ సరిగా జరగలేదని భావించారు. వెంటనే సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. బీఎన్‌ కండ్రిగ సీఐని విచారణ అధికారిగా నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

విచారణ నిర్వహించిన బీఎన్‌ కండ్రిగ సీఐ... హేమసుందర్‌ది ఆత్మహత్యకాదని... ఆస్తి కోసం సోదరులు, తండ్రి కలిసి హత్య చేశారని నివేదిక సమర్పించారు. హత్య కేసు నమోదు చేసి...తండ్రి కపిలేశ్వరయ్యతో పాటు ఇద్దరు కుమారుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యను ఆత్మహత్యగా మార్చడంతో పాటు ఆధారాలు ల‌ేకుండా చేసేందుకు యత్నించారని విచారణలో తెలడంతో... ముగ్గురు సీఐ, ఎస్‌ఐతోపాటు..కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: కూతురిపై వేధింపులు.. తల, కాళ్లు నరికి తండ్రి ప్రతీకారం!

Last Updated : Mar 30, 2022, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details