Illegal Sand mining in AP: వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సీఎం జగన్ సమీప బంధువు ఒకరు ఇసుక క్వారీల లీజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రీచ్ నుంచి ఆయనకు నెలకు కోటి నుంచి 2 కోట్లు చెల్లించేలా.. స్థానిక నేతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రేయింబవళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. వెదరూర్ వద్ద ఇసుక క్వారీకి అనుమతి ఉంది. కానీ స్థానిక వైకాపా నాయకులు ఇరుపాపురం వద్ద కూడా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు.
అక్కడికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో.. రైతుల పొలాల్లో నుంచి అడ్డంగా రహదారి వేసుకుని టిప్పర్లు, లారీల ద్వారా ఇసుక తరలించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో రైతులు, స్థానిక తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్రమంగా ఇసుక తీస్తున్న క్వారీ వద్దకు వెళ్లి పనులు అడ్డుకున్నారు. పంట పొలాలు పాడయ్యేలా వ్యవహరిస్త్తే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
పెండ్లిమర్రి మండలంలో కూడా ఇసుక దందా సాగుతోంది. రైతులతో కలిసి తెదేపా నాయకులు ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొత్తగంగిరెడ్డిపల్లెలో నిబంధనలకు విరుద్ధంగా 5 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక లోడుతో వెళ్తున్న లారీలతో రెండు నెలల కిందట వేసిన తువ్వపల్లె రహదారి దెబ్బతింది.