ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 1, 2021, 4:42 AM IST

ETV Bharat / city

CROP DAMAGE WITH FLOODS AP : భారీగా పంటనష్టం...కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నివేదిక

Crop Damage with Floods in andhra pradesh : రాష్ట్రంలో ఇటీవల కురిసిన అతి భారీవర్షాలు.. వరదలతో 13 జిల్లాల రైతులూ భారీగా నష్టపోయారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.2వేల కోట్లకు పైనే నష్టం జరిగింది. అత్యధికంగా 5.66 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతినడం.. 5వేల పశువుల మృత్యువాత వరదల తీవ్రతకు దర్పణం పడతాయి. ప్రాజెక్టుల కట్టలు, వేల చెరువులు తెగిపోయాయి. రహదారులు కోతకు గురయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. రైతులకు పెట్టుబడి సాయం, తాత్కాలిక పునరుద్ధరణ, శాశ్వత పునర్నిర్మాణ పనులకు రూ.6,333 కోట్లు కావాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.

పంట నష్టంపై కేంద్రానికి రాష్ట్రం నివేదిక
పంట నష్టంపై కేంద్రానికి రాష్ట్రం నివేదిక

Crop Damage with Floods in andhra pradesh : నవంబరులో కురిసిన అతి భారీ వర్షాలతో.. రైతుకు ఎదురైన కష్టం అంతా ఇంతా కాదు. కోత దశలో ఉన్న వరి నీట మునగడంతో గింజ కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కడప జిల్లాలో కోసి ఇంటికి తెచ్చిన ధాన్యం కూడా వరదలో కొట్టుకుపోయింది. సెనగ నీట మునిగి కుళ్లిపోయింది. వేరుసెనగ నల్లబారింది. ఉద్యానపంటలు నీటిలోనే కుళ్లిపోయాయి. మొత్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.405 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా.

మూగజీవాల మరణయాతన

పశుసంవర్ధక, మత్స్యశాఖలకు రూ.5.50 కోట్ల నష్టం వాటిల్లింది. వేలాదిగా కోళ్లు చనిపోయాయి. 5 వేల వరకు పశువులు చనిపోయాయి. మత్స్యకారుల పడవలు, వలలు ధ్వంసమయ్యాయి.

గట్లు తెగిన చెరువులు

ఎగువన భారీ, అతిభారీ వర్షాలు కురిసి.. దిగువకు వరదై ప్రవహించింది. నిండు కుండల్లా ఉన్న చెరువులను ముంచెత్తి గట్లు తెంచేసింది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. జలవనరుల శాఖలోనే సుమారు 2,400 వరకు చెరువులు, ఇతర నీటివనరులు దెబ్బతిన్నాయి.

రహదారుల కోత

ముంచెత్తిన వరదలతో ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయాయి. జాతీయ రహదారులు కోతకు గురికావడంతో పాటు నీరు నిలిచింది. 120 చోట్ల కోతకు గురైనట్లు అంచనా. పంచాయతీరాజ్‌శాఖ ఆధీనంలోని 864 కి.మీ, రహదారులు, భవనాలశాఖ పరిధిలో 1,650 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి. పురపాలకశాఖ పరిధిలోనూ 600 కిలోమీటర్లకు పైగా రహదారులకు నష్టం వాటిల్లింది. బీ తాగునీటిని సరఫరా చేసే 860 పథకాలపై వరద ప్రభావం పడింది. 242 చోట్ల పైపులైన్లు దెబ్బతిన్నాయి. పురపాలకశాఖ పరిధిలో 400 కిలోమీటర్ల మురుగునీటి పారుదల వ్యవస్థ దెబ్బతింది. 6,128 వీధిదీపాలు ధ్వంసమయ్యాయి. 32 నగర/పురపాలక సంస్థల పరిధిలో వరదల ప్రభావం ఉంది.

తాత్కాలిక పునరుద్ధరణకు రూ.1,644 కోట్లు, శాశ్వత పనులకు రూ.3,454 కోట్లు...

Crop Damage with Floods in andhra pradesh : శాఖలవారీ నష్టంపై ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి అందించింది. వివిధ రంగాలకు సంబంధించి రూ.6333.66 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం.. తాత్కాలిక సహాయ, పునరుద్ధరణ కార్యక్రమాలకు రూ.1235.28 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల పరిధిలోకి రాని పంట నష్టం, పునరుద్ధరణ కార్యక్రమాలకు రూ.1644.04 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.3454.34 కోట్లు అవసరమని తెలిపింది.

ఇవీచదవండి

ABOUT THE AUTHOR

...view details