గుంటూరులో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా తెదేపా, కాంగ్రెస్, వామపక్షాలతో పాటు వివిధ రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు.. జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. నూతన వ్యవసాయ బిల్లులను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. వీటి వల్ల రైతు ఉనికి ప్రశ్నార్థకంగా మారడమే కాక.. వ్యవసాయరంగం బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోతుందని సీపీఐ నేత కోట మాల్యాద్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని 1,200కు పైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మిగతా ప్రైవేటు బస్సులు, ఆటోలను నిరసనకారులు అడ్డుకోగా.. ప్రజారవాణా స్తంభించింది. కార్యాలయాలు, విద్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించగా.. హింసాత్మక చర్యలకు ఆస్కారం లేకుండా పోలీసులు పహారా నిర్వహించారు.
అమరావతి రైతుల మద్దతు:
భారత్ బంద్కు అమరావతి రైతులు మద్దతు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ.. వెలగపూడి కూడలిలో మానవహారంగా ఏర్పడి జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడం లేదా అంటూ ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించారు. మందడంలో వామపక్షాలతో కలిసి అన్నదాతలు ఆందోళన చేశారు. దిల్లీలో రైతుల నిరసనకు సంఘీభావం తెలుపుతూ.. రాజధాని ప్రాంతంలో దుకాణాలు మూసివేశారు.
చిలకలూరిపేటలో..
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బంద్కు మద్దతుగా తెదేపా, సీపీఐ, సీపీఎం నేతలు.. రైతు సంఘాలతో కలిసి చిలకలూరిపేటలో నిరసన చేపట్టారు. పలుచోట్ల ర్యాలీ నిర్వహించిన నాయకులు.. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, పాఠశాలలను మూయించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.