ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 8, 2022, 12:54 PM IST

Updated : Jul 8, 2022, 2:01 PM IST

ETV Bharat / city

Y.S. Vijayamma Resign: వైకాపాకు 'అమ్మ రాజీనామా'.. కుమార్తె కోసం

YS Vijayamma resign to YSRCP Honor President post
వైకాపా గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

12:52 July 08

తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండ

వై.ఎస్.విజయమ్మ

YS Vijayamma Resignation: గుంటూరు జిల్లా చినకాకానిలో జరుగుతున్న వైకాపా ప్లీనరీ వేదికగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా. షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా... సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి. -వై.ఎస్.విజయమ్మ

ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సజీవంగా ఉన్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. తన జీవితం జనంతో ముడిపడి ఉందని వైఎస్‌ ఎప్పుడూ చెప్పేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఎక్కడైనా అధికారం కోసమే పార్టీలు పుడతాయని.. వైకాపా మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసమే పుట్టిందని తెలిపారు. జగన్‌పై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టారని.. ఓర్పు, సహనం, ధైర్యంతో జగన్‌ నిలబడ్డారని పేర్కొన్నారు. పేదలప్రజల కోసం సీఎం జగన్ అనేక పథకాలు తెచ్చారని.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చారని వివరించారు.

వైఎస్‌ను ప్రేమించిన ప్రతి గుండెకూ నమస్కరిస్తున్నాను. వైకాపాకు అండగా మొదట్నుంచీ ప్రజలు ఉన్నారు. జగన్ అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలు అన్నీ కలిసి జగన్‌పై దాడి చేశాయి. జగన్‌పై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టారు. మా కుటుంబం ఎన్నో కష్టాలు, నిందలు భరించింది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే వైకాపా పుట్టింది.ఓర్పు, సహనం, ధైర్యంతో జగన్‌ నిలబడ్డారు. తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలనేదే జగన్ తపన. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చారు. పేదలప్రజల కోసం అనేక పథకాలు తెచ్చారు. తెచ్చిన ప్రతి పథకంలోనూ విప్లవం తెచ్చిన ఘనత జగన్‌దే. -వై.ఎస్.విజయమ్మ

ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి.. వైకాపా ప్రభుత్వ పాలన.. మనసుతో, మానవత్వంతో చేసే పాలన అని విజయమ్మ తెలిపారు. జనం నుంచి వచ్చిన నేతకు.. ఇతర కారణాల నుంచి వచ్చిన నేతకు తేడా ఉందన్నారు. ఓటు అడిగే నైతిక హక్కు ఉన్న నేత జగన్‌ అని.. ఎన్నో కష్టాలు పడి జగన్‌ ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు.

నాన్న బాటలోనే నడుస్తానని జగన్‌ చిన్నప్పుడే చెప్పాడు. ప్రజల ప్రేమాభిమానాలు సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. మనసుతో చేసే పరిపాలనను కళ్లారా చూసి ఆనందిస్తున్నా. జగన్‌ మాస్ లీడర్‌.. ఎందరో నేతలకు ఆదర్శం. ఎన్నో కష్టాలు పడి జగన్‌ ఈ స్థాయికి వచ్చాడు. -వై.ఎస్.విజయమ్మ

అభివృద్ధి అంటే ప్రజల జీవన శైలిని పెంచడమే.. మీ పిల్లల భవిష్యత్తు జగన్‌ చేతుల్లో పెట్టండి.. ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని.. ప్రతి మహిళను లక్షాధికారి చేస్తానన్న వైఎస్‌ మాటను జగన్‌ నిజం చేస్తున్నారని విజయమ్మ తెలిపారు. జగన్‌కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని.. ఆదాయం, ఆహారం, ఇల్లు, విద్య, వైద్యాన్ని ప్రతి ఇంటికీ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన శైలిని పెంచడమేనని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ మమ్మల్ని వదిలేసినా జనం అక్కున చేర్చుకున్నారని విజయమ్మ తెలిపారు.

జగన్‌ను మీరు అన్నివేళలా కాపాడుకున్నారు. నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని మరోసారి చెబుతున్నా. వైఎస్ కుటుంబంతో ప్రజల అనుబంధం 45 ఏళ్లుగా కొనసాగుతోంది. కడప జిల్లా ప్రజలకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. ప్రతి మనిషినీ వైఎస్‌ ప్రేమించారు. -వై.ఎస్.విజయమ్మ

ప్రజల ప్రేమతోనే..తన అన్న జగన్ జైలులో ఉన్నప్పుడు.. షర్మిల పాదయాత్రకు వెళ్తే కాస్త భయం వేసిందని విజయమ్మ ఈ సందర్భందా తెలిపారు. ప్రజల అభిమానమే షర్మిలను వేల కిలోమీటర్లు నడిపించిందన్నారు. 4,638 కి.మీ. జగన్ పాదయాత్ర.. ప్రజల ప్రేమతోనే సాధ్యమైందని అన్నారు.

మా కుటుంబం, అనుబంధం, సంస్కారం గొప్పవి. నాన్న ఆశయాలు నెరవేర్చాలని షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. తెలుగువారి గుండెచప్పుడు.. వైఎస్ రాజశేఖరరెడ్డి. షర్మిల తెలంగాణలో, జగన్‌ ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -వై.ఎస్.విజయమ్మ

ఇవీ చూడండి:

Last Updated : Jul 8, 2022, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details