YSRCP Plenary: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రతి దశలో మహిళలకు అండగా నిలిచిందని, వారి సాధికారత, రక్షణ, ఆత్మగౌరవానికి నిర్వచనంగా మూడేళ్ల పాలన ఉందని ఆ పార్టీ మహిళా నేతలు అన్నారు. ‘మహిళా సాధికారత - దిశ చట్టం’పై తీర్మానం సందర్భంగా మహిళా మంత్రులు, పలువురు నేతలు మాట్లాడారు.
కొవిడ్లోనూ ఏ పథకమూ ఆగలేదు: మంత్రి ఉషశ్రీ చరణ్
‘సీఎం జగన్ మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్నారు. అత్యధికంగా ఏపీలోనే 51.6 శాతం మంది మహిళలు కీలక పదవుల్లో ఉన్నారని కేంద్ర సర్వేలో తేలింది. కొవిడ్ సమయంలో కూడా ఏ పథకమూ ఆగలేదు. ఆయా పథకాలు ఆపేయాలని ‘మహానాడు’లో తెదేపా నేతలతో మాట్లాడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందే పథకాలు ఆపేయాలా? జగన్ రథ చక్రాలు ముందుకు సాగాలంటే ఆయన్ను మరోసారి సీఎం చేసుకోవాలి’ అని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ విడివిడిగా పోటీకి వస్తారా?: మంత్రి రోజా
‘జగన్ను భయపెట్టేందుకు దొంగలంతా కలిసి రాష్ట్రం నలుమూలలా సమావేశాలు పెడుతున్నారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు, ఇది శాసనం అన్న పవన్కల్యాణ్ను.. శాసనసభ గేటు కూడా తాకనివ్వకుండా చేశారు. ధైర్యముంటే చంద్రబాబు, పవన్ విడివిడిగా పోటీకి వస్తారా? తెదేపా.. జగన్ను ఉన్మాది అనడం బాధాకరం. దిశ చట్టం కేంద్రం వద్ద ఉండి, ఇంకా అమలు కాలేదు. దానిని ఇక్కడి పోలీసులు స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నారు. ఇది ప్లీనరీలా కనిపించడం లేదు. జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి రిహార్సల్లా ఉంది’ అని మంత్రి రోజా తెలిపారు.
- ‘రాష్ట్రంలో పరిపాలన పరమైన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 55 శాతం రాజ్యాధికారం జగన్ ఇచ్చారు. 2024లో 175 సీట్లూ గెలవాలి’ అని పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలు పోతుల సునీత కోరారు.
- వైకాపా ప్లీనరీలో ప్రతినిధులు, వీఐపీలకు శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో 8 రకాల మాంసాహార కూరలతోపాటు మొత్తం 25 రకాల వంటకాలను వడ్డించారు. గుంటూరు, నెల్లూరు, చీరాల, భీమవరం, ఒంగోలు, కృష్ణా జిల్లాలోని ఇందుపల్లి వంటి ప్రాంతాల నుంచి సుమారు 3వేల మంది వంటమనుషులను పిలిపించి వంటలు చేయించారు. సుమారు 250 కౌంటర్లను ఏర్పాటు చేసి భోజనాలను వడ్డించారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, చికెన్ ఫ్రై వంటి 8 రకాల మాంసాహార కూరలు, శాకాహారులకు వెజిటబుల్ బిర్యానీ, పనసకాయ బిర్యానీతోపాటు కూరలు వడ్డించినట్లు నిర్వాహకులు తెలిపారు.
- ప్లీనరీకి వచ్చినవారికి ఒక జ్యూట్ బ్యాగ్ ఇచ్చారు. దానిలో జగన్ బొమ్మ, ఫ్యాన్ గుర్తు ముద్రించిన పెద్ద కాఫీకప్పు, రెండు పార్టీ కండువాలు, పార్టీ మేనిఫెస్టో, నవరత్నాల అమలుకు సంబంధించిన మూడు పుస్తకాలు, వాటర్ బాటిల్ ఉన్నాయి. 108 వాహనాలు 10-12, వైద్యులను సిద్ధంగా ఉంచారు.
ఇవీ చూడండి: