యూరియా తయారీ, వినియోగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశంలో సాగులో అత్యధికంగా వినియోగిస్తున్న ఈ రసాయన ఎరువును సూక్ష్మ(నానో) పరిమాణంలో ద్రవరూపంలో అమ్మకానికి అనుమతించింది. ఈ మేరకు నిత్యావసరాల చట్టం సెక్షన్ 3 కింద ఎరువుల నియంత్రణ చట్టం-1985కి సవరణ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రస్తుతం యూరియాను ఘన స్పటికాల రూపంలో 45 కిలోల బస్తాగా రైతులకు విక్రయిస్తున్నారు. రాయితీ, పన్నులతో కలిపి దీని గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ) రూ.266. పంట సాగుకు ముందు మట్టి నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించి నత్రజని లోపం ఉంటే యూరియాను వాడాలి. అయితే దేశంలో భూసార పరీక్షలు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో.. నత్రజని లోపం ఎంత ఉందో తెలియక రైతులు ఇష్టారీతిగా యూరియాని వినియోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై రాయితీ భారం ఎక్కువవుతోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రూ.47,805 కోట్లను యూరియాపై రాయితీగా కేంద్రం భరిస్తోంది. దీంతోపాటు వృథాని తగ్గించడానికి నానో యూరియాను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది.
సిద్ధమవుతున్న ఇఫ్కో కంపెనీ
నానో యూరియాను 500 మిల్లీలీటర్ల సీసా రూపంలో మార్కెట్లో విక్రయించడానికి ఇఫ్కో కంపెనీ సిద్ధమవుతుంది. ఈ కంపెనీకి నానో యూరియా తయారీపై పేటెంట్ ఉంది. అర లీటరు ద్రవ యూరియా ధర.. 45 కిలోల బస్తా ధరకు సమానంగా ఉంటుందని సమాచారం. ఇతర కంపెనీలు ఈ పరిజ్ఞానంతో నానో యూరియా తయారుచేసి విక్రయించడానికి కేంద్ర ఎరువులశాఖ నుంచి, రాష్ట్రాల వ్యవసాయశాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. తాము తయారు చేసిన నానో యూరియా ప్రభావం, రసాయన గాఢత, జీవ భద్రతపై జాతీయ గుర్తింపు ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఏ ప్రాంతంలో దీనిని తయారుచేస్తున్నారో ఆ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నమూనాలు ఇచ్చి పంటలపై చల్లి పరీక్షలు చేయించి ఆమోద పత్రం తీసుకోవాలి. వినియోగంపై రైతులకు పక్కాగా శిక్షణ ఇవ్వాలి. జాగ్రత్తలను వివరించే పత్రాన్ని సీసాతో ఇవ్వాలి. అందులో నత్రజని ఎంత శాతం ఉంటుందనేది తెలుపాలి.