ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 4, 2022, 5:27 PM IST

ETV Bharat / city

పీయూష్‌ గోయల్‌పై ప్రివిలేజ్​ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

Privilege notice on Piyush Goyal: ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్​ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​పై తెరాస ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఉప్పుడు బియ్యం ఎగుమతులపై సభను తప్పుదోవ పట్టించేలా కేంద్ర మంత్రి సమాచారం ఇచ్చారని నోటీసులో ఆరోపించారు.

పీయూష్​ గోయల్​
పీయూష్​ గోయల్​

మాట్లాడుతున్న కేశవరావు

Privilege notice on Piyush Goyal: కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై తెరాస ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. పీయూష్‌పై రాజ్యసభలో ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చిన ఎంపీలు.. ధాన్యం ఎగుమతుల అంశంపై కేంద్రమంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఆ నోటీసులో ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 1న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇచ్చిన సమాధానంలో ఉప్పుడు బియ్యం ఎగుమతులపై సభను తప్పుదోవ పట్టించారని ప్రస్తావించారు.

డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం భారత్‌ నుంచి ఉప్పుడు బియ్యానికి సంబంధించి ఎలాంటి ఎగుమతులూ చేయడం లేదని తెలిపారని తెరాస ఎంపీలు.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో పేర్కొన్నారు. కేంద్రం లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఎగుమతి చేసినట్లు ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను జతపరుస్తూ పీయూష్​ గోయల్‌పై ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు. సభను తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

TRS MPs on Paddy: 'వన్​ నేషన్- వన్​ ప్రొక్యూర్​మెంట్ తీసుకురండి:బియ్యాన్ని ఎగుమతి చేయట్లేదంటూ కేంద్రం అబద్ధాలు చెప్తోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఆరోపించారు. పారా బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం ఎగుమతి చేస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు. దిల్లీలో తెరాస ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో కేకే మాట్లాడారు.

గత ఏడేళ్లుగా దేశంలో ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందని.. కేంద్రం ప్రతి అంశాన్నీ వ్యాపారం, లాభం కోణంలోనే చూస్తోందని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలును ప్రజా సంక్షేమం కోణంలో చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు పారా బాయిల్డ్‌ రైస్‌ అడుగుతున్నాయని.. ఇలాంటి సమయంలో కేంద్రం సేకరించి ఆయా దేశాలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ కేంద్రమంత్రులను బెదిరించలేదని.. ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి మాత్రమే చేశామన్నారు.

''తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి ధర్మ యుద్ధం నడుస్తోంది. యాసంగిలో బ్రోకెన్ రైస్ వస్తుంది. ఈ విషయం కేంద్రానికి తెలుసు.. దశాబ్దాలుగా ఎఫ్​సీఐ వాళ్లు సేకరణ చేస్తారు. బియ్యాన్ని ఎగుమతి చేయట్లేదని కేంద్రం అబద్ధాలు చెప్తోంది. డబ్ల్యూటీవో ప్రకారం ఆయా దేశాల ఆహార భద్రతను కాపాడటానికి పారా బాయిల్డ్ రైస్ ఎగుమతి చేయొచ్చు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచంలో ఇన్ని దేశాలు సిద్ధంగా ఉంటే.. పారా బాయిల్డ్ రైస్ ఎందుకు పంపడం లేదు. ఒక పక్క మార్కెట్ ఉంటే.. దేశంలో మిగులు ధాన్యం ఉందని మరో పక్క చెబుతున్నారు. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్​మెంట్ పాలసీ తీసుకురండి. మొత్తం దేశం, పార్లమెంట్​ను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు. కేంద్రం ఒప్పుకునే వరకు మా యుద్ధం కొనసాగుతుంది. పారా బాయిల్డ్ రైస్​కు మార్కెట్ లేదు అని గతంలో చెప్పారు. కానీ బయట దేశాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఉంది కదా ఎందుకు తీసుకోరు.' - కె.కేశవరావు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత

తెలంగాణ రైతులపై కక్ష కట్టి వివక్ష:గతంలో తాము ఏదైతే చెప్పామో అదే జరుగుతోందని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రైతుల పట్ల కక్ష కట్టి.. వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్​లో ఒక మాట... బయట ఒక మాట... తెలంగాణలో ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాటలు మార్చి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం నుంచి పార్​బాయిల్డ్ రైస్​తో పాటు అన్ని రకాల రైస్ ఎగుమతి అవుతోందని అభిప్రాయపడ్డారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇస్తోందని వెల్లడించారు. పెద్ద మొత్తంలో రైస్ ఎగుమతి చేస్తున్నారని అన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల రైతుల రైస్​ను ఎగుమతి చేస్తూ తెలంగాణ రైస్ మాత్రం ఎందుకు చేయరు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. పార్లమెంట్​లో నిర్విరామంగా రైతుల సమస్యను లేవనెత్తుతున్నా... నిర్లక్ష్యం చేస్తున్నారు. డబ్ల్యూటీవో ఒప్పందం తర్వాత కూడా ఎగుమతులు చేస్తున్నారు. తెలంగాణ అంశం రాగానే డబ్ల్యూటీవో అని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టే మనసు మాత్రమే కేంద్రానికి ఉంది. తెలంగాణ రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్​కు తెలుసు. ఇన్నేండ్లు ఎలా కాపాడుకున్నామో యావత్ దేశానికి తెలుసు. ఇదే రైతులు, తెలంగాణ ప్రజలే మీకు బుద్ది చెబుతారు. ఒక రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి అండగా ఉంటారని అనుకుంటారు. మొత్తానికి మొత్తం రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఒక ప్రకటన ఆడిగితే.... ఏ స్పందనలేదు.. అందుకే వాకౌట్ చేశాం. - నామ నాగేశ్వరరావు, తెరాస లోక్​సభాపక్ష నేత

పీయూష్‌ గోయల్‌పై సభాహక్కుల నోటీసు..కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ దేశాన్ని తప్పుదోవ పట్టించారని తెరాస ఎంపీలు ఆరోపించారు. డబ్ల్యూటీవో ఆంక్షలతో పారా బాయిల్డ్‌ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదంటూ ఇటీవల రాజ్యసభలో పీయూష్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అబద్ధమని పేర్కొంటూ ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన లేఖను రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. రూల్‌ 187 కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెరాస ఎంపీలు తెలిపారు.

ఇదీ చదవండి:జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవం

ABOUT THE AUTHOR

...view details