ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2021, 9:50 AM IST

ETV Bharat / city

నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం

లోకకల్యాణంగా భక్తకోటి భావించే రాములోరి కల్యాణానికి తెలంగాణలోని భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జగదానందకారకుడు, జగదభిరాముడు, జానకిరాముడిగా భక్తకోటి తీరొక్క పేరుతో ముద్దుగా పిలుచుకునే.. శ్రీరాములవారి కల్యాణ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య చైత్రమాస అభిజిత్ లఘ్నమున సీతారాములకు కల్యాణం జరగనుంది. రెండో ఏడాదీ అత్యంత నిరాడంబరంగా భక్తజనం లేకుండానే సాదాసీదాగా స్వామి వారి పరిణయ వేడుక జరగనుంది.

lord rama and seetha
నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం

నేడు సీతారాముల కల్యాణోత్సవం... అపురూప వేడుకకు సర్వం సిద్ధం

జగాలను ఏలిన జగదేకవీరుడికి.. జగన్మాత సీతమ్మకు జరిగే కల్యాణం విశ్వ కల్యాణంగా భావిస్తారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న తెలంగాణలోని భద్రాద్రి దివ్యక్షేత్రం సీతారాముల వారి కల్యాణ శోభతో కళకళలాడుతోంది. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా... నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేకవీరుడు రామయ్యకు అతిలోక సుందరి సీతమ్మకు కమనీయమైన పరిణయ వేడుక జరగనుంది. సీతారాముల వారి వివాహా క్రతువుకు రాములోరి సన్నిధి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. తొలుత మూలవరులకు అభిషేకం, ఆ తర్వాత ప్రధాన ఆలయంలో ఏకాంతంగా కల్యాణవేడుక జరగనుంది. తదనంతరం ఉత్సవ మూర్తులకు అలంకార సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య సాగే కల్యాణ ఘట్టం ఆద్యంతం వైభవోపేతంగా సాగనుంది.

అభిజిత్ లఘ్నమున...

బేడా మండపానికి సీతారాములు వారు విచ్చేసిన తర్వాత రామయ్య తండ్రికి పచ్చలహారం, సీతమ్మ తల్లికి చింతాకుపతకం, లక్ష్మణుల స్వామివారికి వారికి రామమాడ సమర్పిస్తారు. అభిజిత్ లఘ్నమున జరిగే సీతారాముల వారి కల్యాణ ఘట్టంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరిగ్గా 12 గంటలకు వేద పండితులు వేదమంత్రాలను పఠిస్తుండగా.....మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ సీతమ్మ తలపై రాములోరు జీలకర్ర బెల్లం పెడతారు. 12.30 గంటలకు మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుక జరుగనుంది.

రెండో ఏడాదీ సాదాసీదాగా...

భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామనామస్మరణ మధ్య వైభవోపేతంగా సాగే ఆ కల్యాణవేడుక రెండో ఏడాదీ సాదాసీదాగా జరగనుంది. కొంతమంది ప్రముఖులు, వైదిక పెద్దల సమక్షంలో బేడా మండపంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు శారు. ఎండ తీవ్రత దృష్ట్యా గుడి ఆవరణ మొత్తం చలవపందిళ్లు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించనున్నారు.

సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తుల కోసం....టీవీల ద్వారా వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:

ఇవాళ రామతీర్థంలో రాములోరి కల్యాణం

ABOUT THE AUTHOR

...view details