ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అందరి సహకారంతోనే తీరంలో ఆహ్లాదం: ఐరాస టీవీలో తెలుగు మహిళ ప్రసంగం

ఆమె చదివింది తొమ్మిదో తరగతే.. అయినా.. ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో ప్రసంగించి ఘనత సాధించారు. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో భారత్ నుంచి ఆమెకు అవకాశం దక్కింది. సముద్ర కాలుష్య నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు

By

Published : Jun 9, 2021, 7:21 AM IST

Updated : Jun 9, 2021, 2:13 PM IST

telugu
telugu

ఐరాస టీవీలో తెలుగు మహిళ ప్రసంగం

‘అందరి సహకారంతోనే మా ప్రాంతంలోని సముద్ర తీరంలో ఎక్కడా పాలిథిన్‌ వ్యర్థాలు కనిపించడం లేదు. తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రదేశమంతా ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. ఇదే కృషిని మరింత కొనసాగించడం ద్వారా నా వంతు సేవను నిరంతరాయంగా అందిస్తా..’ అంటూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన తాడి దీపిక ఐరాస వెబ్‌ టీవీలో మాట్లాడింది. ఆమె ప్రసంగం మంగళవారం రాత్రి 9.20 గంటలకు ప్రసారమైంది. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఈమె సముద్ర కాలుష్యం నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై చక్కగా మాట్లాడారు.

ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో మన దేశం నుంచి ఈమెకు అవకాశం దక్కింది. దీపిక మాట్లాడుతూ.. ‘ఎంతో ఆహ్లాదకరంగా ఉండే అంతర్వేది సముద్ర తీరమంతా ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వ్యర్థాలతో నిండిపోవడంతో కాలుష్యం పెరిగిపోయింది. నేను, నా తోటివారు కలిసి గ్రామంలో ప్రతి ప్రాంతానికెళ్లి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తీసుకెళ్లేవాళ్లం. గత ఫిబ్రవరిలో అంతర్వేది కేంద్రంగా గ్రీన్‌ వార్మ్‌, స్మార్ట్‌ విలేజ్‌ మూవ్‌మెంటు, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంటు ప్రాజెక్టు ఏర్పాటైంది. గ్రీన్‌ వార్మ్‌ ప్రతినిధులు చెప్పిన విషయాలను అవగాహన చేసుకుని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు నా వంతు కృషి చేశా. వ్యర్థాలను పారేయడానికి పలు ప్రాంతాల్లో ఇనుప బుట్టలను ఏర్పాటు చేశాం. అన్నిచోట్లా పాలిథిన్‌ వ్యర్థాలను సమూలంగా ఏరివేయడంతో ప్రస్తుతం ఎక్కడా అవి లేవు. వాటిని జీరో వేస్ట్‌ కేంద్రంలో విభజన చేసి రీసైక్లింగ్‌కు పంపుతున్నాం’ అని ఆమె వివరించారు.

దీపిక కృషి ఫలితాన్నిచ్చింది: గవర్నర్‌

తాడి దీపికను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ట్విటర్‌ వేదికగా అభినందించారు. ఐరాస సదస్సులో మన దేశం నుంచి దీపిక పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. వ్యర్థాల నిర్వహణపై తీరప్రాంత గ్రామాల్లో అవగాహన కల్పించడం ద్వారా సముద్ర జలాల్లో కాలుష్య నివారణకు ఆమె చేసిన కృషి ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మార్గాని భరత్‌, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

వైఎస్ వివేకా హత్య కేసులో ముమ్మరంగా నాల్లో దఫా విచారణ

Last Updated : Jun 9, 2021, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details