ప్రతిపక్ష నేతలపై వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెదేపా నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వారు రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలిపారు.
రాష్ట్రంలో పోలీసు పాలన
తెదేపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అరెస్ట్కు నిరసనగా విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తెదేపా నిరసన చేపట్టింది. సూర్యమహల్ కూడలి వద్ద పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకుడు పెడిరెడ్డి చిట్టిబాబు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని విమర్శించారు. అనకాపల్లిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నడుస్తున్న ఆటవిక పాలనకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. విశాఖలోనూ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అక్రమ అరెస్టులతో పరిపాలన చేయాలని చూస్తోందని ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. చీడికాడ - చోడవరం ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
రాక్షస పాలన
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని రమణమూర్తి ఆరోపించారు. ఆమదాలవలసలో గాంధీ విగ్రహం వద్ద తెదేపా అధికార ప్రతినిధి తమ్మినేని విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ బాబును రామయ్యపుట్టుగలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నీ పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. పాలకొండ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ బొమ్మ కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజాంలో తెదేపా శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు.
కక్ష సాధింపు చర్యలు
కృష్ణా జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెదేపా నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కృష్ణా జిల్లా చందర్లపాడులో పార్టీ శ్రేణులు నిరనస చేపట్టారు. స్థానిక కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ప్రతిపక్ష నాయకులపై వేధింపులు మానుకోవాలని కంచికచర్లలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. నందిగామ గాంధీ సెంటర్లో జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు, తెలుగు మహిళ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెదేపాపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా అరెస్టులు చేస్తోందని కృష్ణా జిల్లా కార్యదర్శి సాంబశివ రావు అన్నారు.
ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి
తెలుగుదేశం నాయకుల అరెస్టులను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఆ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. 42 వ నంబర్ జాతీయ రహదారిపై ఇందిరాగాంధీ కూడలిలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఇలాంటి చర్య అప్రజాస్వామికమన్నారు. అనంతపురంలోనూ నిరసన జరిగింది. పెనుకొండలో తెదేపా నాయకులు గాంధీ కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.