ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెప్పేది ఒకటి, చేసేది మరోకటి అంటూ.. తెదేపా నేతల ధ్వజం

By

Published : Jun 28, 2022, 8:51 PM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు మండిపడ్డారు. మూడేళ్లలో మద్యం విక్రయాల ద్వారా సీఎం జగన్, ఆయన బినామీలు 15 వేల కోట్ల రూపాయలు సంపాదించారని నేతలు ఆరోపించారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తానని చెప్పి మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ మిగిలిపోయారని విమర్శించారు.

TDP
TDP

చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైకాపా పాలనపై అన్నివర్గాల్లో వ్యతిరేకత ఉందన్నారు.

రాష్ట్ర ఆదాయాన్ని సీఎం జగన్.....తాడేపల్లి ప్యాలెస్‌కు తరలిస్తున్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తానని చెప్పి మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ మిగిలిపోయారని విమర్శించారు. పాఠశాల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వకుంటే జూలై 1 నుంచి తెలుగుదేశం తరఫున ఆందోళనలు చేస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాల్లోనూ జగన్ ముఠా కల్తీకి పాల్పడుతోందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ పరిశోధనలో అరబిందో ఫార్మా కల్తీ విషయాలు వెలుగుచూశాయన్నారు. అరబిందో అనుసరిస్తున్న విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా దేశ, రాష్ట్ర ప్రతిష్ట మంట కలుస్తోందని ఆరోపించారు.

మూడేళ్లలో మద్యం విక్రయాల ద్వారా సీఎం జగన్, ఆయన బినామీలు 15 వేల కోట్ల రూపాయలు సంపాదించారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మద్యంలో విషకరమైన రసాయనాలు కలిసి ఉన్నాయనడానికి ఎస్​జీఎస్ నివేదికే సాక్ష్యమన్నారు. ఎస్​జీఎస్ నుంచి రిపోర్ట్ తెప్పించామనడానికి తమ వద్ద సాక్ష్యాలున్నాయని స్పష్టం చేశారు.

చెప్పేది ఒకటి, చేసేది మరోకటి అంటూ.. తెదేపా నేతల ధ్వజం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details