ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 20, 2021, 5:27 AM IST

Updated : Feb 20, 2021, 4:44 PM IST

ETV Bharat / city

తుది దశకు చేరిన పల్లె పోరు.. రేపు నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్

రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరాయి. రేపు ఉదయం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందుల, జమ్మలమడుగు సహా అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తుది దశకు చేరిన పల్లె పోరు.. రేపు నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్
తుది దశకు చేరిన పల్లె పోరు.. రేపు నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్

నాలుగు దశల పల్లెపోరులో చివరి విడత పోలింగ్​ రేపు జరగనుంది. 13 జిల్లాల పరిధిలోని 161 మండలాల్లో 3,299 పంచాయతీలు, 33,435 వార్డుల్లో నాల్గో విడత ఎన్నికలకు ఎస్​ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 2,744 పంచాయతీలు, 22,422 వార్డులకు రేపు ఉదయం పోలింగ్‌ జరగనుంది. ఆదివారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2,743 పంచాయతీస్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22,422 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మొత్తం 67,75,226 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నాలుగో విడతలో 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. నాలుగో విడతలో 53,282 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలతో ఆయా గ్రామాలకు ఈ రాత్రికే చేరుకోనున్నారు.

భద్రతా చర్యలు చేపట్టిన ఎస్​ఈసీ..

నాలుగోవిడత ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించిన ఎస్​ఈసీ తదననుగుణంగా భద్రతా చర్యలు చేపట్టింది. ప్రధానంగా కడప జిల్లాలో ఎక్కువ శాతం ఏకగ్రీవాలైనా... పోటీ అనివార్యమైన చోట ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటోంది. సీఎం సొంత నియజకవర్గం పులివెందులలో 109 పంచాయతీలకు గాను 88 ఏకగ్రీవంకాగా మిగిలిన 21 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. సింహాద్రిపురం మండలం కసనూరు, సింహాద్రిపురం, గురజాల, చవ్వారిపల్లి, రావులకొలను పైడిపాలెం, నంద్యాలంపల్లి, లోమడ, లింగాల మండలం కోమన్నూతల, లోపట్నూతల, బోనాల, అంకెవారిపల్లి, పెద్దకుడాల, వెలిదండ్ల పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది.

ఆ స్థానాల్లో ఆధిపత్య పోరు..

ఇక కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ కొన్ని చోట్ల నేతల ఆధిపత్య పోరాటంతో పోటీ తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీమంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు సర్పంచ్‌ పదవులకు పోటీపడుతున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు..

జమ్మలమడుగు నియోజకవర్గంలో 115 పంచాయతీలుంటే 18 మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. పెద్దముడియం మండలంలో 18 పంచాయతీల్లో పోటీ నెలకొంది. ముద్దనూరు మండలంలో... 19 పంచాయతీలుండగా.. ఒక్కటీ ఏకగ్రీవం కాలేదు. జమ్మలమడుగు మండలంలో పది పంచాయతీల్లో పోటీ నెలకొంది. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నాలుగు రోజుల నుంచి కవాతు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి :

సప్తవాహనాలపై శ్రీనివాసుడి అభయం

Last Updated : Feb 20, 2021, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details