పరిశ్రమలకు నీటి సరఫరాను పర్యవేక్షించటానికి ఏపీఐఐసీకి అనుబంధంగా పనిచేసేలా ప్రత్యేక కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీనికి ఎస్పీవీ ఏర్పాటు చేయనున్నారు. పైపులైన్లు, సమ్మర్ స్టోరేజి ట్యాంకు, ఇతర పనుల కోసం అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణాల రూపేణా కంపెనీ సమకూర్చుకుంటుందని ఒక అధికారి తెలిపారు.
ప్రస్తుతం విశాఖ ప్రాంతంలోని పరిశ్రమలకు విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ (విస్కోస్), కొన్నిచోట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా కిలో లీటర్కు రూ.40 వంతున వసూలు చేస్తున్నారు. పారిశ్రామిక పార్కులకు నీరు సరఫరా చేయడానికి అవసరమైన పనులకు వెచ్చించిన మొత్తం ఆధారంగా నీటి ఛార్జీలను నిర్ణయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
పదేళ్ల నీటి అంచనాల ఆధారంగా..
పారిశ్రామిక క్లస్టర్లు, సెజ్లకు వచ్చే పదేళ్లలో ఎంత నీరు అవసరమవుతుందో అంచనాలను ఏపీఐఐసీ రూపొందించింది. అందులో ప్రస్తుతం 25 శాతం నీటిని సరఫరా చేసేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నీటి నిల్వకు అవసరమైనచోట సమ్మర్ స్టోరేజి ట్యాంకు, పైపులైను ఏర్పాటుకయ్యే వ్యయాన్ని అంచనా వేసి పనులను చేపడుతుంది. రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకోవటానికి సొంతంగా పైపులైను వేసుకోవడానికి భారీ పరిశ్రమలు ముందుకొస్తే అనుమతించాలని భావిస్తున్నారు.
రాయలసీమ ప్రాంతంలోని సెజ్ల కోసం..
- దక్షిణాంధ్రలోని పారిశ్రామిక క్లస్టర్లు, సెజ్లకు నీటి సరఫరా కోసం రూ.621.43 కోట్లతో వివిధ పనులను చేపట్టారు. కృష్ణపట్నంలోని క్రిస్ సిటీ, నాయుడుపేట సెజ్, మాంబట్టు సెజ్, ఏర్పేడు, శ్రీకాళహస్తి సెజ్ల పరిధిలోని పరిశ్రమలకు నీటి సరఫరా కోసం కండలేరు నుంచి పైపులైను ఏర్పాటు పనులను ప్రతిపాదించారు. స్టార్టప్ ఏరియా కింద అభివృద్ధి చేస్తున్న 5,075 ఎకరాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు నీటిని అందించనున్నారు.
- కర్నూలులోని ఓర్వకల్ దగ్గర 9,300 ఎకరాల్లో ప్రతిపాదించిన సెజ్ కోసం శ్రీశైలం బ్యాక్వాటర్ తీసుకోవాలని నిర్ణయించారు. ఏడాదిలో వంద రోజులే నీరివ్వగలమని జలవనరుల శాఖ పేర్కొంది. మిగిలిన రోజుల్లో నీటి సరఫరా కోసం రూ.500 కోట్లతో వెయ్యి ఎకరాల్లో సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మించాల్సి వస్తుంది. దీంతో భూమి, డబ్బు వృథా అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఏడాదిలో కనీసం 300 రోజులు శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి రిజర్వాయర్లోకి పైపులైను ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేయిస్తున్నారు.
- కొప్పర్తి పారిశ్రామిక పార్కు కోసం తొలుత సోమశిల నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఈ పైపులైను వెళ్లే మార్గం అటవీ ప్రాంతంలో ఉన్నందున అనుమతులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా గండికోట నుంచి నీటిని తీసుకునేలా డీపీఆర్లను రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: