ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2021, 4:45 AM IST

ETV Bharat / city

తక్షణం రూ.546 కోట్ల బకాయి కట్టకపోతే కఠిన చర్యలు

రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఏపీజెన్‌కో, ఏపీపీడీసీఎల్‌ తమకు బకాయిపడ్డ రుణ వాయిదా మొత్తం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ లేఖ రాసింది. లేకపోతే బకాయిలు రాబట్టుకోవడానికి చట్టప్రకారం తగు చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

power
power

రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఏపీజెన్‌కో, ఏపీపీడీసీఎల్‌ (ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ) తమకు బకాయిపడ్డ రుణ వాయిదా మొత్తం రూ.546 కోట్లను తక్షణం చెల్లించాలని, లేకపోతే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ(CS Sameer Sharma)కు కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) సీఎండీ సంజయ్‌ మల్హోత్రా(REC CMD Sanjay Malhotra) ఇటీవల ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్రప్రభుత్వ సంస్థలు రుణ ఎగవేతకు (డిఫాల్ట్‌) పాల్పడటం అనూహ్యమని, దానివల్ల ఆర్‌ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, మొత్తం విద్యుత్‌రంగం కూడా తీవ్ర ప్రతికూల పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. వీరందరి ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, వెంటనే రుణ బకాయిలు చెల్లించాల్సిందిగా ఏపీజెన్‌కో, ఏపీపీడీసీఎల్‌లకు సూచించాలని ఆయన కోరారు. లేకపోతే బకాయిలు రాబట్టుకోవడానికి చట్టప్రకారం తగు చర్యలు చేపడతామని స్పష్టంచేశారు.

‘రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు మాకు చెల్లించాల్సిన బకాయిలపై 2021 అక్టోబరు 12న లేఖలు రాశాం. తర్వాత విజయవాడలోని మా కార్యాలయం కూడా సంప్రదించింది. ఏపీఈపీడీసీఎల్‌(apepdcl), ఏపీఎస్‌పీడీసీఎల్‌(apspdcl) బకాయిలు చెల్లించాయి. కానీ ఏపీజెన్‌కో, ఏపీపీడీసీఎల్‌ బకాయిలు చెల్లించకపోవడం వల్ల వాటి ఖాతాలు.. మా రికార్డుల్లో నిరర్థక ఖాతాలుగా (ఎన్‌పీఏ) మారిపోయాయి’ అని ఆ లేఖలో ఆర్‌ఈసీ సీఎండీ పేర్కొన్నారు. 2021 అక్టోబరు 31 నాటికి ఏపీజెన్‌కో రూ.405 కోట్లు, ఏపీపీడీసీఎల్‌ రూ.141 కోట్లు బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. ‘రుణ వాయిదాలు ఎగవేసిన ఖాతాల వివరాల్ని ఆర్‌బీఐ దృష్టికి, సిబిల్‌ వంటి రుణాల పర్యవేక్షణ సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి. అవి నిరర్థక ఆస్తులుగా మారడం వల్ల ఆ సంస్థల ఆర్థిక విశ్వసనీయతకే కాదు, రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠకూ భంగం వాటిల్లుతుంది. రుణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఎగవేతదారుగా మారినందుకు ఆ సంస్థల ఎస్క్రో ఖాతాలపై తగిన చర్యలు చేపడతాం. ఇచ్చిన మొత్తం రుణాన్ని కట్టాలని కోరడం, సెక్యూరిటీలపైనా, దివాలా చట్టం కిందా చర్యలు తీసుకుంటాం. వీటన్నిటికీ మించి ఆర్‌సీఈ నుంచి ఇకపై ఎలాంటి అదనపు నిధులూ ఇవ్వం’ అని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఆదిత్యనాథ్‌దాస్‌ సెప్టెంబరు నెలాఖరున పదవీ విరమణ చేసినా లేఖలో సీఎస్‌గా ఆయన పేరునే రాయడం విశేషం.

ఇదీ చదవండి

PRATIDWANI: రాష్ట్రం అప్పుల తిప్పల్లో కొత్త సమస్యలు.. రూ.12,427 కోట్ల విద్యుత్ బకాయిలు

ABOUT THE AUTHOR

...view details