ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 28, 2021, 6:45 AM IST

ETV Bharat / city

PV NARASIMHA RAO: ఇవాళ పీవీ జయంతి.. నేటితో ముగియనున్న శతజయంతి ఉత్సవాలు

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఏడాది పాటుగా తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర దేశాల్లో శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ఘనంగా నిర్వహించగా.. నేడు హైదరాబాద్​ పీవీ మార్గ్​లోని జ్ఞానభూమిలో నిర్వహించే కార్యక్రమాల్లో గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​ పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌ చౌరస్తాలో పీవీ కాంస్య విగ్రహాన్ని సీఎం, గవర్నర్ ప్రారంభించనున్నారు.

pv narasimha rao
పీవీ నరసింహరావు

ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాజ్యసభ సభ్యులు కేశవరావు ఛైర్మన్‌గా పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీని ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఏడాది కాలంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే కరోనా కారణంగా పూర్తిస్థాయిలో జరపలేకపోయింది. పీవీకి భారతరత్న ప్రకటించడం సహా హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరుపెట్టడం సహా పలు ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పంపింది. గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​ పీవీ సమాధిని సందర్శించి నివాళులర్పించనున్నారు. పీవీ ఘనతపై రూపొందించిన 9 పుస్తకాలను సీఎం కేసీఆర్‌ విడుదల చేయనున్నారు. మరికొన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

పీవీ విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డును పీవీఎన్​ఆర్​ మార్గ్‌గా ఇప్పటికే ప్రభుత్వం మార్చింది. నెక్లెస్‌రోడ్డు ప్రారంభంలోనే ఏర్పాటుచేసిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకూ ఎన్నో భారీ విగ్రహాలుండగా.. తొలిసారి అధునాతన లేజర్‌ సాంకేతికత వినియోగిస్తున్నారు. అమెరికా నుంచి తెప్పించిన సీఎన్​సీ యంత్రం ద్వారా పీవీ ముఖాన్ని అచ్చు గుద్దినట్లు సిద్ధం చేశారు. పసిడి వర్ణంలో మెరిసే ఆ కాంస్య విగ్రహం 26 అడుగులు ఎత్తు, 2 టన్నుల బరువు ఉండనుంది. దాదాపు రూ. 27 లక్షలు వెచ్చించి15 మంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి... 17 రోజుల్లో తీర్చిదిద్దారు. పీవీ విగ్రహం కొలువుదీరనున్న నెక్లెస్‌ రోడ్‌ కూడలితోపాటు జ్ఞాన భూమిని అందంగా అలంకరించారు.

మాజీ ప్రధాని దివంగత PV నర్సింహారావు విగ్రహావిష్కరణ దృష్ట్యా... నెక్లెస్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇదీ చదవండి:

NO DSC: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ హామీ.. నెరవేరదేమి?

ABOUT THE AUTHOR

...view details