ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2019, 5:37 AM IST

ETV Bharat / city

'చంద్రబాబుపై కసితోనే అమరావతికి మంగళం'

మూడు రాజధానుల నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం గత ప్రభుత్వం, చంద్రబాబుపై కోపంతోనే... భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తాయి. నూటికి నూరుపాళ్లు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని... అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని డిమాండ్‌ చేశాయి.

opposition leaders about capital cities
'చంద్రబాబుపై కసితోనే అమరావతికి మంగళం'

'చంద్రబాబుపై కసితోనే అమరావతికి మంగళం'

రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను... విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్పితే... రాజధానుల ఏర్పాటుతో ఏ ప్రాంతానికీ మేలు జరగదని కుండబద్దలు కొడుతున్నాయి. దీనివల్ల ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై స్పందించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా... ఈ అంశంలో పూర్తిస్థాయి అధ్యయనం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు సీపీఐ సీనియర్‌ నేత నారాయణ. రాజధానుల నిర్ణయం అమలు కారణంగా ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు హయాంలో కట్టారనే ఏకైక కారణంతో... అమరావతికి జగన్‌ మంగళం పాడుతున్నారని నారాయణ విమర్శించారు. ప్రజలపై ప్రేమతో కాకుండా... కసితోనే రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు.

రాష్ట్రంలో 3 రాజధానుల ప్రతిపాదన ఖర్చుతో కూడుకున్నదని... రాజకీయం కోసం రాజధానిని వికేంద్రీకరించకూడదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అభిప్రాయపడ్డారు. 3 రాజధానుల మధ్య మంత్రులు, అధికారులు తిరగడం.. వ్యయప్రయాసలతో కూడుకున్నదనే విషయం మరవరదాన్నారు. దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఆర్థిక భారమని వాళ్ల పాలకులే చెబుతున్నారని గుర్తుచేశారు.

హైకోర్టు ఇచ్చినంత మాత్రాన రాయలసీమ అభివృద్ధి చెందదని తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం భూములిచ్చిన రైతుల జీవితాలతో ఆడుకోవడం సరికాదని మరో నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా తెలుగుమహిళ విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామలో బీసీ సంఘం రాస్తారోకో చేసింది.

ఇదీ చదవండీ...

సమరావతి: నేడూ పోరుబాటలోనే రాజధాని రైతులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details