ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2021, 5:59 AM IST

ETV Bharat / city

Unlock: తెలంగాణలో లాక్​డౌన్ ఎత్తివేత

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కార్యకలాపాలన్నీ సాధారణంగానే సాగనున్నాయి. కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. లాక్‌డౌన్‌కు ముందున్న.. అన్ని కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ప్రజలు మాత్రం స్వీయనియంత్రణ మరవద్దని.. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. గచ్చిబౌలి టిమ్స్ సహా గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, అల్వాల్ సమీపంలో సూపర్ స్పెషాలిటీ ఆసుత్రులను... మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Unlock: తెలంగాణలో లాక్​డౌన్ ఎత్తివేత
Unlock: తెలంగాణలో లాక్​డౌన్ ఎత్తివేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం... రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని... కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలోఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది. దీంతో మే 12 నుంచి రాష్ట్రంలో అమలైన లాక్‌డౌన్‌ ముగిసింది. ఇవాళ్టి నుంచి ఇక కార్యకలాపాలన్నీ సాధారణంగా సాగనున్నాయి. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం అన్‌లాక్ ఉత్తర్వులను జారీ చేసింది. లాక్‌డౌన్‌కు ముందున్న కార్యకలాపాలు అన్నింటినీ అనుమతిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం... ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. బహిరంగ, పని ప్రదేశాలతో పాటు ప్రయాణ సమయాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని... లేదంటే వెయ్యి రూపాయల జరిమానా పడుతుందని సర్కార్ హెచ్చరించింది. దుకాణాలు, కార్యాలయాలు, సంస్థల వద్ద కరోనా నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాలని... లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దన్న ఉద్దేశంతోనే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నామని... అంతమాత్రాన కొవిడ్​ విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ, కరోనా నిబంధనలను పాటించాలని... ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని కోరింది. ప్రజల నిర్లక్ష్యంతో కేసుల సంఖ్య పెరిగితే మళ్లీ లాక్‌డౌన్‌ తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.

నాలుగు సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులు

హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న టిమ్స్‌ను ప్రజాఅవసరాలకు అనుగుణంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతిచ్చింది. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో, అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో కొత్తగా ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మంజూరు చేసింది. రైతుబంధు పంపిణీ సాఫీగా సాగుతోందని, ఇప్పటివరకు 5 వేల 145 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కరోనా కష్టకాలంలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తి చేసిన పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని కేబినెట్ అభినందించింది. యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. నాయీ బ్రాహ్మణుల కోసం గతంలో నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చేనేత, గీత కార్మికులకు బీమా, మత్స్య, గీత కార్మికులకు అందించాల్సిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని తెలిపింది. వివిధ వృత్తి కులాలు, ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

హుజూరాబాద్​లో గెలుపు తెరాసదే!

హైదరాబాద్ కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్‌గా మార్చాలని.. నిర్ణయించింది. ధరణి అమలు తీరుపై మంత్రివర్గంలో సమీక్ష జరిగింది. ప్రత్యేకించి రైతుల సమస్యలు, వాటి పరిష్కారం తీరుతెన్నులపై చర్చించారు. దాదాపు 90 వేల ఫిర్యాదులకు గాను 70వేలకు పైగా పరిష్కారం అయ్యాయని అధికారులు చెప్పినట్లు సమాచారం. పల్లె, పట్టణప్రగతి పనుల పురోగతి, ఆకస్మిక తనిఖీలపైనా సమావేశంలో చర్చ జరిగింది. పల్లెప్రగతి, పట్టణప్రగతిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. హుజూరాబాద్ ఉపఎన్నికపైనా మంత్రులతో ప్రస్తావించిన ముఖ్యమంత్రి... తెరాసదే గెలుపని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక లాక్‌డౌన్ ఎత్తివేత నేపథ్యంలో.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌ పోస్టును ఎత్తివేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా... రాష్ట్రంలోకి రాకపోకలు సాగించవచ్చని వెల్లడించారు.

ఇదీ చదవండి:cabinet: కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details