ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 18, 2021, 4:22 PM IST

Updated : Jun 18, 2021, 4:35 PM IST

ETV Bharat / city

AP Jobs: జాబ్ క్యాలెండర్​ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!

రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లేదా ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని సీఎం జగన్ పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక 6 లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్న ముఖ్యమంత్రి.. ఏడాదిలో మరో 10వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్​ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కిందటి ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందన్న సీఎం.. ఇప్పుడు హోదా కోసం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. హోదా కోసం దిల్లీ వెళ్లిన ప్రతిసారీ విజ్ఞప్తి చేస్తున్నామని... ఎప్పుడో ఓసారి మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

సీఎం జగన్
సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి

ఈ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయాల్సి ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్​ను ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్​ను విడుదల చేశారు. జులై నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 10 వేల 143 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనే వివరాలతో జాబ్ క్యాలెండర్​​ విడుదల చేశారు.

ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారని, వ్యయ ప్రయాసల కోర్చి ఎన్నో ఏళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నారని సీఎం అన్నారు. వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి, పక్షపాతం, వివక్ష, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రాతిపదకన ఉద్యోగాలిస్తామని, నియామకాల్లో ఇంటర్వూలకు స్వస్తి చెప్పామని వెల్లడించారు.

కిందటి ప్రభుత్వం 1.40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎగురగొట్టారన్న సీఎం జగన్... అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 6 లక్షల 03 వేల 756 ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 22 వేల శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున కొత్త వ్యవస్థను తీసుకువచ్చామని, 2.50 లక్షలకుపైగా నిరుద్యోగులను వాలంటీర్లగా నియమించామని వివరించారు.

లక్షా 84 వేల 264 మందికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 3లక్షల 99 వేల 791 ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్​పై, 19 వేల 701 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో ఇచ్చామన్నారు. చాలీచాలని వేతనాలతో ఉన్న 7 లక్షల 02 వేల 656 మంది ఉద్యోగుల వేతనాలు పెంచామన్నారు. ప్రభుత్వంపై 3 వేల 500 కోట్లు అదనపు భారం పడుతున్నా... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్న సీఎం... 51 వేల 387 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించినట్టు వివరించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేలు తీసుకువచ్చి వేతనాలు పెంచామన్నారు.

ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడిన సీఎం జగన్... కిందటి ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రానికి హోదా రావడం లేదని విమర్శించారు. ఓటుకు కోట్ల కోసం ప్రత్యేక హోదాను గత ప్రభుత్వం పూర్తిగా తాకట్టు పెట్టిందన్న ముఖ్యమంత్రి.. ప్యాకేజీల కోసం రాజీ పడిందన్నారు. ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదా ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చే ఉద్యోగాలనూ తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఫలితంగా ప్రత్యేక హోదా కోసం పదేపదే అడగడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా ఇవ్వాలని విన్నవించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎప్పుడో ఓసారి మంచి జరుగుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు.

కొవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిందన్న సీఎం జగన్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎక్కడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్​లు ఏర్పాటు చేశామని, స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లు, 8 చోట్ల హార్బర్లు, 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఆసరా, చేయూత తదితర పథకాలను అమూల్, పీఅండ్‌జీ లాంటి పెద్ద కంపెనీలతో లింక్‌ చేశామన్నారు. గ్రామస్థాయిలో ఉద్యోగాల విప్లవానికి ఇవన్నీ నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామన్న సీఎం.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇదీ చదవండీ... Raghurama letter to CM Jagan: 'సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలి'

Last Updated : Jun 18, 2021, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details