ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC ON VIVEKA MURDER CASE: దస్తగిరి సాక్ష్యం తప్పనిసరి

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుడి మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అనుమతించడాన్ని సవాలుచేస్తూ నిందితులు ఎర్ర గంగిరెడ్డి (ఏ1), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది.

By

Published : Feb 17, 2022, 5:27 AM IST

HC ON VIVEKA MURDER CASE
HC ON VIVEKA MURDER CASE

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుడి మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అనుమతించడాన్ని సవాలుచేస్తూ నిందితులు ఎర్ర గంగిరెడ్డి (ఏ1), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది. నిందితుల నేర నిరూపణకు ప్రత్యక్షసాక్ష్యం కావాలనే ఉద్దేశంతో దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని కడప కోర్టును సీబీఐ అభ్యర్థించిందని తెలిపింది. సరైన సాక్ష్యాలు లేనందున నేరగాళ్లు తప్పించుకోకుండా ఉండేందుకే సీబీఐ ఇలా వ్యవహరించిందని వివరించింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఖరారు చేసింది. చట్టప్రకారం సీబీఐ ముందుకెళ్లొచ్చని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఈమేరకు కీలక తీర్పునిచ్చారు.

ప్రత్యక్ష సాక్ష్యం సేకరించలేకపోయారు: న్యాయమూర్తి

‘కోర్టు ముందున్న రికార్డులనుబట్టి.. ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్‌యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి.. వివేకాను హతమార్చేందుకు ప్రేరణ కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి కొందరు నిందితులు వ్యతిరేకంగా పనిచేశారని వివేకా భావించారు. కడప ఎంపీ టికెట్‌ కేటాయింపు విషయంలోనూ నిందితులతో వివేకాకు వివాదముంది. వివేకాకు దస్తగిరి పూర్వ వాహన డ్రైవర్‌ కావడంతో మిగిలిన నిందితులు రూ.5 కోట్లు ఆఫర్‌ చేసి హత్యకు ప్రణాళిక రచించారు. 2019 మార్చి 14/15వ తేదీన హత్య జరిగినప్పటికీ స్థానిక పోలీసులు, సిట్‌, సీబీఐ దర్యాప్తులలో కేసుకు సంబంధించిన ‘ప్రత్యక్ష సాక్ష్యం’ సేకరించలేకపోయారు. గంగిరెడ్డి ఆరోజు వివేకాతో ఇంట్లో రాత్రి కలిసి ఉండటం, మిగిలిన నిందితులు అర్ధరాత్రి ఇంట్లోకి రావడం, ఇంట్లోనుంచి కొన్ని శబ్దాలను వినడం, కాసేపటికి నిందితులు నలుగురు ఇల్లువిడిచివెళ్లడం చూశానన్న మేరకే వాచ్‌మెన్‌ రంగన్న సాక్ష్యం ఉంది’ అని న్యాయమూర్తి వివరించారు.

ప్రత్యక్ష సాక్ష్యం కోసమే దస్తగిరికి క్షమాభిక్ష

‘హత్య సమయంలో వివేకా ఇంటిలోపల, పడక గదిలో, బాత్‌రూంలో ఏమైందన్నది రంగన్న చూడలేదు. ఆయన సాక్ష్యం, దర్యాప్తు సంస్థలు సేకరించిన శాస్త్రీయ ఆధారాలు ప్రాసిక్యూషన్‌కు సందర్భోచితంగా ఉపయోగపడతాయి. ఇతర నిందితులతో ప్రత్యక్షంగా, హత్యతో సంబంధమున్న నిందితుడు దస్తగిరి. వివరాలను చెప్పడానికి స్వచ్ఛందంగా ఆయన ముందుకొచ్చినప్పుడు నేరగాళ్లు తప్పించుకోకుండా ‘ప్రత్యక్ష సాక్ష్యం’గా సీబీఐ పరిగణించి క్షమాభిక్షకు చర్యలు చేపట్టింది. హత్యకు సంబంధించి మొదటినుంచి ఏం జరిగిందని సెక్షన్‌ 161, 164 సీఆర్‌పీసీ కింద ఇచ్చిన వాంగ్మూలాల్లో దస్తగిరి వివరించాడు. ప్రేరణ ఏమిటి? నిందితులు ఎక్కడ ఎప్పుడు కలిశారు? హత్యకెలా సిద్ధపడ్డారు? గొడ్డలి ఎక్కడ కొన్నారు? ఎలా దాడి చేశారు? సాక్ష్యాలను ఎలా మాయం చేశారు? తదితర వివరాలను వెల్లడించాడు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఆ వాదనలను సమ్మతించలేం

‘నేర నిరూపణకు తగినన్ని సాక్ష్యాలుండగా దస్తగిరికి క్షమాభిక్ష వీల్లేదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనను సమ్మతించలేం. దస్తగిరికి ముందస్తు బెయిలు ఇవ్వడాన్ని సీబీఐ వ్యతిరేకించకుండా దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనా సరికాదు. ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణ పెండింగులో ఉండగానే 2021 సెప్టెంబరు21న సీబీఐకి దస్తగిరి రాసిన లేఖలో అప్రూవర్‌గా మారతానని తెలిపాడు. నేరం నుంచి తనను మినహాయించుకుంటూ ఇచ్చిన వాంగ్మూలం కాదది. ఇతర నిందితుల నేరాన్ని నిరూపించేందుకు దస్తగిరి సాక్ష్యం అనివార్యం/ఆవశ్యకం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఆ రాష్ట్రంలో 100 శాతం పంపిణీ పూర్తి.. టీకా కేంద్రాలు మూసివేత!

ABOUT THE AUTHOR

...view details