అమూల్ పాల సేకరణ(high court on amul products), వ్యాపార అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన సొమ్ము ఖర్చుచేయవద్దని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నవంబర్ 29 వరకు హైకోర్టు పొడిగించింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు దాఖలు చేసిన కౌంటర్ ప్రతిని రికార్డుల్లో చేర్చాలని రిజిస్ట్రీకి స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు బదలాయించే నిమిత్తం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. మంత్రివర్గ నిర్ణయాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.
సహకార సంఘాలను నిర్వీర్యం చేయడం కోసమే ఎన్డీబీ
తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. 'వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే గుజరాత్కు చెందిన అమూల్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలోని స్థానిక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను నిర్వీర్యం చేయడం కోసమే ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. అమూల్ సంస్థ పాల సేకరణ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోలని.. విఫలమైతే సస్పెండ్ చేస్తామని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఎన్డీబీ ద్వారా రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు బలోపేతం అయ్యేందుకు ప్రోత్సాహాలు, నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థ అయిన అమూల్ను తీసుకురావడం సరికాదు. వాణిజ్యం ద్వారా వచ్చే లాభాలు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ భాగస్వాములైన సభ్యులకు చెందుతాయి తప్ప.. ఏపీలోని సహకార సంఘాలకు చెందవు. అమూల్తో ఒప్పందం వెనుక ప్రభుత్వ దురుద్దేశాలు' ఉన్నాయన్నారు.
వాటి ఆధారంగా న్యాయస్థానం విచారించదు..