పింక్ డైమండ్ విషయంలో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు పరిష్కరించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీపీ వాద్వా నేతృత్వంలోని కమిటీ పింక్ డైమండ్ విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిందని హైకోర్టు స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎమ్. జగన్నాథరావు ఆధ్వర్యంలోని మరో కమిటీ సైతం.. పింక్ డైమండ్తో పాటు డాలర్ కుంభకోణంపై విచారణ జరిపి.. 1952 నుంచి ఇప్పటి వరకు తితిదే రికార్డుల్లో పింక్ డైమండ్ గుర్తించలేదని పేర్కొన్నట్లు తెలిపింది. ఇప్పటికే 2 కమిటీలు పింక్ డైమండ్ విషయంలో నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో ఇదే అంశంపై మరోసారి దర్యాప్తు అవసరం లేదంది. తితిదేకు అసలు పింక్ డైమండ్ ఉందా ? మైసూర్ మహరాజ్ శ్రీవారికి సమర్పించిన పింక్ డైమండ్, స్విట్జర్లాండ్ దేశంలోని జనీవాలో వేలం వేసిన పింక్ డైమండ్ ఒకటేనా? కాదా ? అన్న విషయంపై విచారణ జరిపించాలంటూ తెదేపా అధికార ప్రతినిధి విద్యాసాగర్ వ్యాజ్యం దాఖలు చేశారు.
పింక్ డైమండ్పై నివేదికలు వచ్చాయి..దర్యాప్తు అవసరం లేదు: హైకోర్టు
తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ విషయంలో ఆరోపణలన్నీ అవాస్తవం అని.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల సారథ్యంలోని రెండు వేర్వేరు కమిటీలు నివేదిక ఇచ్చినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.
పింక్ డైమండ్ విషయంలో విచారణపై హైకోర్టు స్పందన