గ్రామ, వార్డు సచివాలయ నియామకాలకు సంబంధించి ఈ రోజు నుంచి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల కోసం 10,56,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న 1025 కేటగిరీ 1పోస్టుల భర్తీకి ఇవాల ఉదయం 10గంటల నుంచి 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం పరీక్ష జరగనుంది.
మధ్యాహ్నం 2. 30 నుంచి 5 గంటల వరకు గ్రేడ్ -3 ఉద్యోగ నియామక పరీక్ష జరగనుంది. ఖాళీగా ఉన్న 1134 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు మధ్యాహ్నం పరీక్ష జరగనుంది. పరీక్షలకు 6.81 లక్షల అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం పరీక్ష కోసం 2,221 కేంద్రాలు , మధ్యాహ్నం పరీక్షకు 1068 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పరీక్షకు 9. 15గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1.45గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.