రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించారు. రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఈ ఆంక్షలు సడలించటమే మేలని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు కార్యక్రమంలో రాష్ట్ర సీఎం జగన్ ఈ ప్రతిపాదన చేశారు. ఏపీలో 676 మండలాలు ఉన్నాయని... ఇందులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న రెడ్ జోన్లో 37 మండలాలు ఉన్నాయని...అలాగే ఆరెంజ్ జోన్లో 44 మండలాలు ఉన్నాయని ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ వివరించారు. మిగతా 595 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని.. ఇక్కడ ప్రస్తుతానికి కరోనా ప్రభావం లేదని సీఎం వివరించారు. లాక్ డౌన్ను కొనసాగించే పక్షంలో రెడ్ జోన్లకే పరిమితం చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రధానికి తెలిపారు. జనం గుమిగూడకుండా షాపింగ్ మాళ్లు, సినిమాహాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది తన అభిప్రాయమన్నారు.
పటిష్టంగా లాక్ డౌన్ అమలు
ఈ విషయంలో తన అభిప్రాయంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై సంక్షిప్తంగా ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్టు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశా వర్కర్లు, 20,200 మంది ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ వ్యూహం కొనసాగుతోందని తెలిపారు.
కొవిడ్ ఆస్పత్రుల వివరాలు వెల్లడి