కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన కొన్ని అంశాల్లో 2030 నాటికి స్థిరమైన అభివృద్ధి సాధించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ అభిలాషించారు. విశాఖలో జరిగిన 69వ జాతీయ టౌన్ అండ్ కంట్రీప్లానర్స్ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కొవిడ్ వల్ల ఇంటి నుంచే పనిచేసే విధానం కొనసాగుతోందని...ఇది ఇంకా ఎన్నిరోజులు ఉంటుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనికోసం భవిష్యత్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలో సూచనలు ఇవ్వాలని కోరారు.
నగరాల్లో భరించలేని స్థాయిలో అద్దెలు, భూములు ధరలు పెరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. భూసేకరణ ప్రభుత్వానికి ఎంతో భారంగా మారిందని...దీన్ని తగ్గించేందుకు విలువైన సూచనలు ఇవ్వాలని సదస్సులో కోరారు. దీంతోపాటు పేద, మద్య తరగతి ప్రజలకు గృహ వసతి కల్పించడం, నగరాల్లో నీటి నిర్వహణ, ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న ఉద్గారాల తగ్గింపు కోసం సూచనలు కోరారు. సమగ్ర తీరప్రాంత అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రానికి ఉపయోగపడే సూచనలు ఇవ్వాలన్నారు.
మూడురోజుల పాటు జరగనున్న సదస్సులో చర్చించిన అంశాలు, సూచనలను కచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం హామీ ఇచ్చారు. మీ సలహాలు, సూచనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.