ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 7:25 PM IST

ETV Bharat / city

పోలవరం పునరావాస నిధులను కేంద్రమే భరించాలి:బుగ్గన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. 2013-14 అంచనాల ప్రకారం అయితే ఇబ్బంది అవుతుందని కేంద్ర మంత్రికి చెప్పామని ఆయన వెల్లడించారు.

buggana rajendranath reddy
buggana rajendranath reddy

పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ కంపోనెంట్​కు సంబంధించిన పునరావాస కార్యక్రమాల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో బుగ్గన మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టు అంచనాల గురించి కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం మొత్తం 12 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 8 వేల కోట్లను కేంద్రం ఇచ్చింది. ఇంకా 4 వేల కోట్లు రూపాయలు రావాల్సి ఉండగా... అందులో 2,234 కోట్ల రూపాయలకు మంజూరు లభించింది. మిగిలిన నిధులకు కూడా అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరాం. 2013-2014 అంచనాలకు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నాటి అంచనాల కంటే భూసేకరణకే 17 వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. భూసేకరణలో 2005-2006 అంచనాలనే 2013-14 అంచనాల్లో పొందుపరిచారు. 2013-14 అంచనాల ప్రకారం అయితే ఇబ్బంది అవుతుందని కేంద్ర మంత్రికి చెప్పాం. సవరించిన అంచనాలు- 1, 2, సహా సవరించిన అంచనా కమిటీ నివేదికలు కేంద్రానికి ఇచ్చాం. వాటిని సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరాం. 2014లో కేంద్రమే ప్రాజెక్టు పునరావాసంలో ఖర్చు పెరిగే అవకాశం ఉందని తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కుడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నాటి తెదేపా ప్రభుత్వం 2013-14 అంచనాలకే ఒప్పందం చేసుకోవడం అతిపెద్ద తప్పు. ఆ నిధులు కూడా కేంద్రమే భరించాలి. రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేస్తోంది. నిర్మాణం పురోగతిలోనే ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details