ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో మద్యం విక్రయాలపై పిటిషన్‌..విచారణ వాయిదా

By

Published : May 11, 2020, 3:43 PM IST

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపడంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్​, ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

liquor sales
liquor sales

కరోనా నేపథ్యంలో మద్యం విక్రయాలు జరపడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు మరొకరు వేసిన పిటిషన్లపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాలకు అనుమతివ్వడం సరైన చర్య కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. మద్యం షాపుల వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మద్యం తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలు చేయడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయస్థానానికి తెలిపారు. ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేస్తామని చెబుతోందని, ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి నిషేధం అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న వివిధ రకాల చీప్ లిక్కర్‌ను పరీక్షలకు పంపాలని పిటిషినర్ తరఫు న్యాయవాది కోరారు.

ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సర్కార్​ సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉందని తెలిపారు. దశలవారీగా దాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిందన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం బుధవారంలోపు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే గురువారం పిటిషనర్ తరఫు న్యాయవాది రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి :

మూడు రోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం అందాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details