ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2021, 6:48 AM IST

ETV Bharat / city

INTER ANNUAL FEE: ప్రైవేటు జూనియర్‌ కళాశాలల వార్షిక ఫీజులు ఖరారు

రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంటర్‌ రెండేళ్ల కోర్సులకు సంబంధించి 2021-22 నుంచి 2023-24 వరకు ఇవి వర్తిస్తాయని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలలైతే రూ.15 వేలు, పురపాలక సంఘాల్లో ఉంటే రూ.17,500, నగర పాలక సంస్థల్లోని వాటికి రూ.20 వేలు వసూలు చేయాలని తెలిపారు.

INTER ANNUAL FEE
INTER ANNUAL FEE

రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫారసును ఆమోదిస్తూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్‌ రెండేళ్ల కోర్సులకు సంబంధించి 2021-22 నుంచి 2023-24 వరకు ఇవి వర్తిస్తాయని పేర్కొన్నారు.

ప్రైవేటు జూనియర్‌ కళాశాలల వార్షిక ఫీజుల ఖరారు

*ఎంపీసీ, బైపీసీ కోర్సులకు ఏడాదికి గరిష్ఠంగా.. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలలైతే రూ.15 వేలు, పురపాలక సంఘాల్లో ఉంటే రూ.17,500, నగర పాలక సంస్థల్లోని వాటికి రూ.20 వేలు వసూలు చేయాలి.

*సీఈసీ, హెచ్‌ఈసీ తదితర కోర్సులకు గరిష్ఠంగా ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.12 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగర పాలక సంస్థల్లో రూ.18 వేలు తీసుకోవాలి.

*ట్యూషన్‌, ప్రాస్పెక్టస్‌, రిజిస్ట్రేషన్‌, ప్రవేశం, పరీక్ష, లేబొరేటరీ, క్రీడలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయం, అదనపు బోధనా కార్యకలాపాలు, విద్యార్థి సంక్షేమ నిధి, ఆరోగ్య సంరక్షణ పథకం, స్టడీటూర్‌, అల్యూమ్ని, ఇతర విద్యాసంబంధ రుసుములన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి.

*విద్యార్థి ఎంచుకుంటే... అదనంగా రవాణా, వసతి తదితర రుసుములు తీసుకోవచ్చు. రవాణా రుసుములకు సంబంధించి.. కిలో మీటరుకు రూ.1.20 చొప్పున తీసుకోవాలి. వసతిగృహాల్లో ఉండే వారైతే ఏడాదికి.. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో రూ.18 వేలు, పురపాలక సంఘాల్లోని వాటికి రూ.20 వేలు, నగర పాలక సంస్థల్లో ఉంటే రూ.24 వేలకు మించకూడదు.

*ఏ ప్రాంతంలోని ట్యుటోరియల్‌ కళాశాలలైనా (ఇంటర్‌తోపాటు జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ) లెక్చరర్లు, మెటీరియల్‌ సరఫరా, పరీక్షలకు అదనంగా రూ.20 వేలు చొప్పున తీసుకోవాలి.

*ప్రతి విద్యార్థి నుంచి వసూలు చేసే ఫీజులకు సంబంధించిన రసీదులను.. వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఆదాయపు పన్ను వివరాలతో కూడిన ఆర్థిక నివేదికలను బహిరంగంగా ప్రదర్శించాలి. ఆదాయపు పన్ను మినహాయింపులను పొందుపరచాలి.

*ఫీజులు తక్కువగా ఉన్నాయని, దీర్ఘకాలం నిర్వహించలేమని ఏదైనా జూనియర్‌ కళాశాల యాజమాన్యం భావిస్తే.. ప్రకటన వెలువడిన 15 రోజుల్లోగా తగిన కారణాలు వివరిస్తూ ప్రతిపాదిత నమూనాలో(బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు, వారి అర్హతలు, విద్యుత్తు ఛార్జీలు, ఇంధనం, క్రీడా పరికరాలు, గ్రంథాలయం, పుస్తకాలు, ల్యాబ్‌ వస్తువులు.. తదితర వివరాలతో కమిషన్‌ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయాలి. సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదును పరిష్కరించే దాకా ఎలాంటి అదనపు ఫీజులూ వసూలు చేయకూడదు.

పదో తరగతికి రూ.18 వేలు

ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చేసిన సిఫారసుల్ని ఆమోదిస్తూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 2021-22 నుంచి 2023-24 వరకు ఈ ఫీజులు వర్తిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థి ఎంచుకుంటే మాత్రం అదనంగా రవాణా రుసుము తీసుకోవచ్చు. ఇందుకు కిలోమీటరుకు రూ.1.20 చొప్పున తీసుకోవాలి.

*ట్యూషన్‌, ప్రాస్పెక్టస్‌, రిజిస్ట్రేషన్‌, ప్రవేశం, పరీక్ష, లేబొరేటరీ, క్రీడలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయ, అదనపు బోధనా కార్యకలాపాలు, విద్యార్థి సంక్షేమ నిధి, ఆరోగ్య సంరక్షణ పథకం, స్టడీ టూర్‌, అల్యూమ్ని, ఇతర విద్యా సంబంధ రుసుములన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి. అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటారు.

*ట్యుటోరియల్‌ పాఠశాలలు.. బోధన, మెటీరియల్‌, పరీక్షల నిర్వహణ పేరిట ఎలాంటి రుసుములు వసూలు చేసేందుకు అనుమతించరు. క్యాపిటేషన్‌ రుసుములు వసూలు చేయకూడదు. ప్రత్యేకించిన దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని చెప్పకూడదు. కనీసం అయిదేళ్ల వరకు యూనిఫాం మార్చకూడదు. మార్చాల్సి వస్తే అందుకు కారణాలు తెలియజేయాలి.

*ఫీజులు తక్కువగా ఉన్నాయని, దీర్ఘకాలం నిర్వహించలేమని ఏదైనా పాఠశాల యాజమాన్యం భావిస్తే.. ప్రకటన వెలువడ్డ 15 రోజుల్లోగా తగిన కారణాలు వివరిస్తూ ప్రతిపాదిత నమూనాలో కమిషన్‌ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయాలి. ఫిర్యాదును పరిష్కరించే వరకు అదనపు ఫీజులు వసూలు చేయకూడదు.

ఇదీ చదవండి: Jagan bail cancel petition: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై తీర్పు నేడే

ABOUT THE AUTHOR

...view details