ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 26, 2021, 7:59 AM IST

ETV Bharat / city

2 డోసులు తీసుకున్న 79% మందిలో యాంటీబాడీలు!

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 79 శాతం మందికి యాంటీబాడీలు వృద్ధి చెందాయని.. ప్రభుత్వం నిర్వహించిన నాలుగో సీరో సర్వే వెల్లడించింది. అసలు టీకాలు పొందని వారిలో.. 59.5 శాతం మందికి యాంటీబాడీలు పెరిగాయని సర్వే తెలిపింది. వీరిలో పట్టణ ప్రాంతాల్లో 63.5, గ్రామీణ ప్రాంతాల్లో 56.38 శాతం మంది ఉన్నారు.

antibodies
యాంటీబాడీలు వృద్ధి!

కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిలో 79% మందికి యాంటీబాడీలు వృద్ధి చెందాయి. అసలు టీకాలు పొందని సాధారణ జనాభాలో సుమారు 59.5% మందికి యాంటీబాడీలు పెరిగాయి. వీరు పట్టణ ప్రాంతాల్లో 63.5%, రూరల్‌లో 56.38% మంది ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన నాలుగో సీరో సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టీకా రెండు డోసులు వేసుకున్న వారిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది (కేటగిరి-1), పోలీసు, అంగన్‌వాడీ (కేటగిరి-2), రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖ ఉద్యోగుల(కేటగిరి-3) నుంచి నమూనాలు సేకరించారు.

రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ 4సార్లు సీరో సర్వైలెన్స్‌ నిర్వహించింది. వైరస్‌ ప్రభావం ఎలా ఉంది? ప్రజల్లో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయా? లేదా? తెలుసుకొనేందుకు ఈ సర్వైలెన్స్‌ను దశల వారీగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 9 నుంచి 16వ తేదీ మధ్య ఒక్కో జిల్లాలో 4,200 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 54,600 మంది నుంచి రక్త నమూనాలు సేకరించింది. రక్త నమూనాలు ఇచ్చిన వారిలో రెండు టీకాలు పొందిన వారు, అసలు టీకాలు వేయించుకోని వారు ఉన్నారు. వీరిచ్చిన రక్త నమూనాలను పరీక్షించి యాంటీబాడీలు వృద్ధి ఎలా ఉందో వైద్య ఆరోగ్య శాఖ విశ్లేషించింది. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ నమూనాల సేకరణ జరిగింది. రెండు డోసుల టీకాలు పొందిన వారిలో మొత్తం 7,800 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. వీటి ఫలితాల ప్రకారం వందకు 79% మందికి యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు వెల్లడైంది. టీకాలు పొందని వారిలో (జనరల్‌ పాపులేషన్‌) 46,800 నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు.

టీకాలు పొందని జనాభాలో ఇలా.. చిత్తూరు జిల్లాలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారిలో 77.2% మంది పురుషులు, 78.5% మంది మహిళలకు యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 76% పురుషులు, 79% మహిళలకు యాంటీబాడీలు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు.
* కనిష్ఠంగా విశాఖ జిల్లా పట్టణ ప్రాంతాల్లో పురుషులకు 35.4%, మహిళలకు 46.8%: గ్రామీణ ప్రాంతాల్లో 29.1% మంది పురుషులు, 33.2% మంది మహిళలకు యాంటీబాడీలు వచ్చాయి.
* తూర్పుగోదావరి జిల్లాలో పట్టణ ప్రాంతాలకు చెందిన పురుషుల్లో 36.9% మందికి, మహిళల్లో 44% మంది యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంత పురుషుల్లో 40.7%, మహిళల్లో 43.3% చొప్పున యాంటీబాడీలు వృద్ధి చెందాయి.
* పశ్చిమగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 71% మంది పురుషులు, 78% మహిళల్లో యాంటీబాడీలు ఉన్నట్లు పరీక్షల ద్వారా తేలింది.

ఇదీ చదవండి:

వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ఆరుగురి జలసమాధి

ABOUT THE AUTHOR

...view details