నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్తల వీరంగం - చూసీచూడనట్లుగా పోలీసులు - YSRCP clash on Road in Anakapally - YSRCP CLASH ON ROAD IN ANAKAPALLY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 11:52 AM IST
YSRCP Clash on Road in Anakapally District : అనకాపల్లి జిల్లా తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. మాడుగుల అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని అనూరాధ గురువారం నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. చీడికాడ - తురువోలు రోడ్డులో చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాలకు చెందిన ఆటోలు, బైకులపై కార్యకర్తలు ర్యాలీగా వస్తుండగా తంగుడుబిల్లి వద్ద ముందు వెళ్తున్న ఆటోకు వెనక ఉన్న ఆటో తగిలింది. దీంతో ఘర్షణ మొదలైంది. తంగుడుబిల్లి వద్ద ఆటోడ్రైవర్లతోపాటు కార్యకర్తలు గొడవ పడ్డారు.
నాయకులు సర్దిచెప్పడంతో వాహనాలు ముందుకు కదిలాయి. కొందరు కార్యకర్తలు ఆటోను వెంబడించి నిలిపివేసి మరోసారి ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అటుగా వచ్చి పోలీసులు వారిని చెదరగొట్టారు. నడిరోడ్డుపై ఘర్షణ పడి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించినా పోలీసులు వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయలేదని పలువురు ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.