వైసీపీ కార్పొరేటర్ భూకబ్జా - నడిరోడ్డుపై మహిళ నిరసన - place occupied kadapa
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 7:40 PM IST
Woman Protest Against YCP Corporator Occupied Place: తనకు మిగిలిన ఉన్న 38 సెంట్లు స్థలాన్ని వైసీపీకి చెందిన కార్పొరేటర్ షంషీర్ కబ్జా చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కడపకు చెందిన శోభ అనే మహిళ స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టింది. అయిదేళ్లు నుంచి ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ తన స్థలం తనకు దక్కడం లేదని, గత్యంతరం లేక ఇలా నడిరోడ్డుపై కూర్చొవాల్సి వచ్చిందని తెలియజేసింది.
తన పూర్వీకుల నుంచి సంక్రమించిన అయిదు ఎకరాల స్థలాన్ని వివిధ రూపాల్లో చాలా మంది కబ్జా చేశారని శోభ చెప్పుకొచ్చింది. తన పేరిట మిగిలి ఉన్న 38 సెంట్లు స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ షంషీర్తో పాటు మరికొంత మంది కలిసి కబ్జా చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి స్థానిక తహసీల్దార్కు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయింది. నగరంలో ఖాళీగా ఉన్న స్థలాలకు నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని బాధితురాలు తెలిపింది. తన స్థలాన్ని ఆమెకు ఇప్పించకపోతే కడప కలెక్టరేట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.