భారీ వర్షాలకు ఉప్పొంగిన మానేరు వాగు - దెబ్బతిన్న రోడ్లు - రాకపోకలకు తీవ్ర అంతరాయం - Roads damaged At Bhupalapally
Published : Jun 29, 2024, 1:31 PM IST
Disruption Of Traffic At Jayshankar Bhupalapalli : భారీ వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి వద్ద మానేరు వాగు ఉప్పొంగింది. దీంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ వేసిన మట్టిరోడ్డు వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
ఫలితంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. భూపాలపల్లి మీదుగా పెద్దపల్లి జిల్లాలకు గర్మిళ్లపల్లి నుంచి వెళ్లాలంటే 30 కి.మీ మేర ప్రయాణం చేయాల్సి ఉండేది. కానీ మట్టిరోడ్డు కొట్టుకుపోవడం వల్ల 100 కి.మీ మేర ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మానేరు వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మట్టిరోడ్డు దెబ్బతిన్న కారణంగా ప్రయాణాలు సాగించేందుకు ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో జలమయమయ్యి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.