నిరుద్యోగులు బాంబులు, గడ్డపారలు తీసుకెళ్లలేదు కదా! ఎందుకు అడ్డుకున్నారు? : రఘువీరారెడ్డి - Raghuveera Reddy angry with jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 9:00 PM IST
Raghuveera Reddy Angry With AP Government due to Sharmila Arrest : ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి అరెస్టును మాజీ మంత్రి రఘువీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో రఘువీరారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ ఏపీ సెక్రటేరియట్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని అరెస్టు చేస్తారా? అంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగులు సెక్రటేరియట్కు బాంబులు, గడ్డపారులు తీసుకుని వెళ్లలేదు కదా, ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. సహనంతో, సామరస్యంగా వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నించారు?. మాట తప్పని మడమ తిప్పని వారు కదా, మరి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ఏమైంది? అని మండిపడ్డారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు అందరికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో 30 వేల పోస్టులు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు భర్తీ చేయలేదని తెలిపారు. నిరుద్యోగులు గొంతు ఎత్తితే అణగదొక్కే చర్యలు తీసుకుంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను నిలదీసే హక్కు నిరుద్యోగులకు ఉందని తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని మీది ఒక ప్రభుత్వమేనా, ఇదేనా ప్రభుత్వం నడిపే తీరు అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.