ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వ జీఓను నిరసిస్తూ రైతులు ఆందోళన - ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 8:13 AM IST
R5 Zone House Lands Registration to Farmers: రాజధానిలో అక్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటారు జిల్లా తుళ్లూరులోని రైతులు పంచాయతీ అధికారులకు వినతి పత్రం అందించారు. ఆర్5 జోన్ కోర్టు పరిధిలో ఉన్నందున రిజిస్ట్రేషన్లు చేస్తే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు పేర్కొన్నారు. స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ రైతులు ప్రదర్శన నిర్వహించారు.
పంచాయితీ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ల బాధ్యతను అప్పగించడంపై రైతులు మండిపడుతున్నారు. నవరత్నాల పథకంలో పేదలందరికి ఇళ్ల కార్యక్రమంలో భాగంగా రాజధాని గ్రామాల్లోని ఆర్-5 జోన్లో పంపిణీ చేసిన సెంటు భూములను రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు తెలిపారు. తుళ్లూరు మండలంలోని రాజధానేతర గ్రామాలు పెదపరిమి, హరిశ్చంద్రపురంలో ఉన్న సెంటు భూముల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు