ఎన్నికల లబ్ధి కోసమే నోటిఫికేషన్ - దగా డీఎస్సీని తక్షణమే రద్దు చేయాలి: జడ శ్రవణ్కుమార్ - Jada Sravan Kumar fires on ys jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 5:49 PM IST
Jada Sravan Kumar Initiation: ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని జై భీమ్ భారత్ పార్టీ (Jai Bheem Bharat Party) అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ అన్యాయం చేసిందని మండిపడ్డారు. విజయవాడలోని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జడ శ్రవణ్ కుమార్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
దగా డీఎస్సీని తక్షణమే రద్దు చేయాలంటూ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ సీసాలు చేతబట్టుకుని నినాదాలు చేశారు. సీఎం జగన్ విడుదల చేసిన డిఎస్సీతో గిరిజన అభ్యర్థులకు తీరని ఆన్యాయం జరుగుతుందని జడ శ్రవణ్ విమర్శించారు. కోర్టుల తీర్పులను సైతం ముఖ్యమంత్రి జగన్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. జైభీమ్ భారత్ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని నిరసన తెలిపారు.