కలువ పూల నడుమ కనకమహాలక్ష్మి - భక్తులకు కనుల పండగ
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
Sri Kanaka Mahalakshmi Decoration with Lotus Flowers: రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.
విశాఖలో బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి రోజూ పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు కనుల పండుగ చేస్తున్నారు. దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా నిత్యం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు వివిధ అలంకరణలో లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారని వేద పండితులు తెలిపారు. ఈ రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన కలువ పువ్వులతో అలంకరించారు. ప్రతి రోజూ వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో ఉభయ దాతల సేవ పేరిట ఈ పుష్పాలంకరణ సేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో రోజు ఒక్కో భక్తుల కుటుంబానికి ఈ సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.