By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 3:16 PM IST
విజయం దిశగా కూటమి - సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు - State Secretariat employees Celebrations
AP Secretariat Employees Celebrations: తెలుగుదేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుండటంతో రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విజయం సంకేతాలను చూపిస్తూ సచివాలయం నుంచి మెయిన్ గేట్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గేట్ ముందు బాణసంచా కాల్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగులకు మేలు జరిగిందని అంతా తెలుసుకుని చంద్రబాబుకు పట్టం కట్టారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులకు అమరావతి లో ఇళ్ల స్థలాలు సహా సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.