Illegal Mining in Joint Nellore District :ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలపై విచారణ సాగుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో సిలికా, తెల్లరాయి, గ్రావెల్ అక్రమాలపై టీడీపీ చేసిన ఫిర్యాదుతో అధికారులు విచారణ చేస్తున్నారు. సైదాపురంలో క్వార్ట్జ్ తవ్వకాలపై విచారణ చేయాలని గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మైనింగ్ అక్రమాల్లో వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Illegal Mining In YSRCP Government :సజ్జల కనుసన్నల్లో వైఎస్సార్సీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి దోపిడీ కథ నడిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ పాత్ర ఉన్నట్లు కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సైదాపురం మండలం జోగుపల్లిలోని 8 గనుల్లో రూ.8,000ల కోట్ల విలువైన ఖనిజం దోచేశారని తెలుస్తోంది. లక్షల టన్నుల క్వార్ట్జ్ను మార్కెట్లో అమ్మేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చిల్లకూరు, సైదాపురంలో సిలికా అక్రమాలతో పాటు సర్వేపల్లి, వెంకటాచలం, కావలిలో గ్రావెల్ తవ్వకాలు, సైదాపురం, పొదలకూరులో తెల్లరాయి అక్రమాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం.