CM Chandrababu Inaugurated Anna Canteen: అన్నార్తులకు పట్టెడన్నం పెట్టేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అన్న క్యాంటీన్ల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టింది. 78వ స్వాతంత్య్ర వేడుకల కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. సతీమణి భవనేశ్వరితో కలిసి గుడివాడ వచ్చిన సీఎం క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు.
అనంతరం సీఎం దంపతులిద్దరూ ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. క్యాంటీన్లో భోజనం చేస్తున్న వివిధ వర్గాల వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఏయే వృత్తుల్లో ఉన్నారు. ఎంత మేరకు ఆదాయం సంపాదిస్తున్నారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఓ వ్యక్తి తాను చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నానని, దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పగా ఆయనకు సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరో చిరు వ్యాపారికి కొత్త తోపుడు బండి ఇప్పించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. అన్న క్యాంటీన్ ఏర్పాటుపై వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం : అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్తో ప్రత్యేక అనుబంధం ఉన్న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదల కడుపు నింపే క్యాంటీన్ల ప్రారంభోత్సవం తనకెంతో ప్రత్యేకమన్నారు. డొక్కా సీతమ్మ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ అని కొనియాడారు. అన్న క్యాంటీన్ మళ్లీ పెడతాను అంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చారని, నారా భువనేశ్వరి కూడా కోటి రూపాయలు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.