Government Provides Three Wheeler Vehicles for Disabled Persons :రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు శుభవార్త అందించనుంది. వారికి 100% రాయితీతో త్రిచక్ర వాహనాలు (Retrofitted Motor Vehicles For Physically Challenged) అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు నివేదించారు.
వాహనాల పంపిణీకి 17.50 కోట్ల రూపాయులు :ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ (Oton Account Budget) నుంచి నిధులు విడుదల అయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 2024-2025 సంత్సరానికి ప్రతీ నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు లక్ష రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం వాహనాల పంపిణీకి 17.50 కోట్ల రూపాయులు అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి 4 నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అయినవారికే : త్రిచక్ర వాహనాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్కసారి మాత్రమే పంపిణీ చేశారు. సుమారు 4 వేల మంది దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్సీపీ నేతలు సిఫారసు చేసిన వారికి ప్రాధాన్యతను ఇస్తూ 1,750 మందికి అందించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ మరోసారి జిమ్మిక్కులు చేశారు. కానీ త్రిచక్ర వాహనాలు ఇవ్వలేదు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ సంవత్సరం 1,750 మందికి త్రిచక్ర వాహనాలు అందించడంతో పాటు ప్రతి సంవత్సరం ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.