నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో సోమవారం రాత్రి పది మంది మహిళా దొంగలు హల్చల్ చేశారు. నవీపేట్కు చెందిన నాగమణి నిజామాబాద్ వెళ్లేందుకు స్థానిక బస్టాండులో బస్సు ఎక్కారు. వెనకే ఉన్న ఐదుగురు మహిళా ముఠా సభ్యులు ఆమె దగ్గర నుంచి 2 లక్షల 80 వేల రూపాయలున్న బ్యాగును అపహరించారు. ఆమె మెడలోంచి గొలుసు లాగే ప్రయత్నం చేయగా... గమనించిన మహిళ అరవడంతో తోటి ప్రయాణికులు దొంగలను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
అదే ప్రయాణ ప్రాంగణంలో అరగంట వ్యవధిలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన పుట్ట సత్యనారాయణ నందిపేటకు వెళ్లేందుకు బస్సు ఎక్కగానే మరో ఐదుగురు ముఠా సభ్యులు అతని బ్యాగులో ఉన్న రూ. 48 వేలు అపహరించుకుని పారిపోతుండగా రూ. 10 వేల నగదు కింద పడిపోయింది. గమనించిన తోటి ప్రయాణికులు పారిపోతున్న మహిళా దొంగల్లో ముగ్గురిని పట్టుకుని ఠాణాకు తీసుకెళ్లారు. మిగతా రూ.38 వేలు తీసుకుని ఇద్దరు మహిళలు పారిపోయినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. నిందితులు మహారాష్ట్ర, ఆదిలాబాద్కు చెందిన ముఠా సభ్యులుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం ...