New Rules for filling cash in ATM : ఏటీఎంలలో నింపేందుకు నగదును తరలించే వాహనాల్లో ఇద్దరు సాయుధ గార్డులు తప్పనిసరి. డబ్బు తీసుకెళ్లే వ్యానుకు జీపీఎస్ ఉండాల్సిందే.. ఇక ఇలాంటి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏటీఎంలకు నగదును తరలిస్తున్న క్రమంలో చోరీకి గురవుతున్న ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీల వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు తెలంగాణ హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. తాజా నిబంధనలతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించారు.
- వాహనంలో డ్రైవర్తోపాటు ఇద్దరు కస్టోడియన్లు, కనీసం ఇద్దరు శిక్షణ పొందిన సాయుధగార్డులు తప్పనిసరిగా ఉండాలి. గార్డుల్లో ఒకరు ముందు సీట్లోను.. మరొకరు వెనకన కూర్చోవాలి. ఏజెన్సీలు సంబంధిత సిబ్బందిని నియమించుకునే సమయంలో వారి ప్రవర్తనపై అనేక అంశాలకు సంబంధించి పరిశీలన చేయాలి. ఎప్పటికప్పుడు వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.
- నగదును తీసుకెళ్లే వాహనాల కదలికలను నిత్యం తెలుసుకునేందుకు వీలుగా కంట్రోల్రూంను ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ట్రిప్పులో రూ.5 కోట్ల లోపు మాత్రమే నగదును తీసుకెళ్లాలి.
- ఏజెన్సీలు నగదును భద్రపరిచే ప్రాంతం పోలీస్స్టేషన్కు సమీపంలో ఉండేలా చూసుకోవాలి. చిన్న పట్టణాల్లోని ప్రాంగణాల్లో రూ.10 కోట్ల లోపు నగదు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. ఈ ప్రాంగణానికి ‘24/7’ సీసీ కెమేరా నిఘాతోపాటు సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ ఉండాలి.
- నగర ప్రాంతాల్లో రాత్రి 9 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల్లోపు మాత్రమే ఏటీఎంలలో నగదు నింపాలి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపే ఈ పని చేయాలి.