పంట రుణాలపై వడ్డీని రైతుల నుంచి బ్యాంకులు నిక్కచ్చిగా వసూలు చేయకుండా వారికి చేయూతనిచ్చేందుకు వడ్డీలేని పంట రుణాల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తోంది. కానీ, ఈ పథకం కింద రెండేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం వల్ల దీనిపై బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకూ దాదాపు 25 లక్షల మంది రైతుల నుంచి రూ.780 కోట్లు వసూలు చేసినట్లు వ్యవసాయ శాఖకు బ్యాంకులు తాజాగా నివేదిక ఇచ్చాయి. ప్రభుత్వం ఈ నిధులు ఇస్తే తిరిగి రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపాయి. ఈ పథకం కింద బకాయిల చెల్లింపునకు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.256 కోట్ల విడుదలకు గత మే 31న పరిపాలన అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ నిధుల కోసం ఖజానాకు బిల్లులు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది (2018) జూన్లోనూ ఇలాగే నిధుల విడుదలకు పరిపాలన ఉత్తర్వులిచ్చినా ఖజానా నుంచి నిధులు వెళ్లలేదు. ఒక రైతు బ్యాంకులో పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన పనిలేదని వీఎల్ఆర్ నిబంధన ఉంది. పంట రుణం ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 7 శాతం వడ్డీ పడుతుంది. ఇందులో 3 శాతం కేంద్రం ఇస్తుంది. మిగతా 4 శాతాన్ని వీఎల్ఆర్ కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 శాతం సొమ్ము రాకపోవడం వల్ల వడ్డీ బకాయిలు రూ.780 కోట్లకు చేరాయి.
ఈ ఖరీఫ్లో ఇచ్చింది 36 శాతమే
ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి సెప్టెంబరులోగా రూ.29,285 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి మే నెలలో నిర్ణయించింది. గత నెలాఖరు నాటికి రూ.10,585 కోట్ల రుణాలు (36.14%) మాత్రమే ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రుణమాఫీ నేపథ్యంలో రైతులు పాత బకాయిలు కట్టడానికి ముందుకు రావడంలేదని, దీనివల్ల రుణాల పంపిణీ తక్కువగా ఉందని బ్యాంకర్లు వ్యవసాయశాఖకు వివరణ ఇచ్చారు. గత రెండు నెలల్లో సరిగా వర్షాలు లేక పంట రుణాల పంపిణీ తక్కువగా ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది.
వడ్డీ వసూలు చేయవద్దని చెప్పాం
పంట రుణాలపై వడ్డీ వసూలు చేయవద్దని బ్యాంకులకు చెప్పామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. వీఎల్ఆర్ పథకం కింద రూ.256 కోట్ల విడుదలకు ఉత్తర్వులిచ్చామన్నారు. మిగతా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. కొత్త బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయిస్తామని. రైతులపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
- ఇదీ చూడండి : అరుణ్ జైట్లీకి అస్వస్థత.. నిలకడగానే ఆరోగ్యం