Nalgonda Politics Telangana Assembly Elections 2023 : నల్గొండ జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్లు దూకుడుతో దూసుకెళుతున్నాయి. నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. గులాబీ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండుసార్లు చుట్టేశారు. మరోసారి పాగా వేయాలనే లక్ష్యంతో అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. పథకాల లబ్ధిదారుల కేటాయింపులో వివక్ష పాటించారనే ఆరోపణలుండటం ప్రతికూలం. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి నల్గొండలో వరుసగా నాలుగుసార్లు గెలిచారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసవత్తర పోరు : గత ఎన్నికల్లో భూపాల్ రెడ్డి చేతిలో ఖంగుతిన్నా.. ఈసారి గెలుపు ఖాయమే ధీమాతో ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్గౌడ్ గడప గడపకు వెళుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మునుగోడు పోరు మరోసారి ఆసక్తిని రేపుతోంది. ఈసారి త్రిముఖపోరు ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉపఎన్నికల తర్వాత చేపట్టిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు.
2018 ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్రెడ్డి అభివృద్ధి కోసం రాజీనామా చేసి అనివార్యంగా వచ్చిన మునుగోడు ఉపపోరులో కమలం పార్టీ తరఫున పోటీచేసి కూసుకుంట్ల చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. హస్తం టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి చివరి నిమిషంలో బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. సీపీఎం అభ్యర్థిగా నర్సిరెడ్డి బరిలో ఉన్న ప్రభావం నామమాత్రమే.
సూర్యాపేట రాజకీయం హోరాహోరీగా మారింది. సీఎం కేసీఆర్కు సన్నిహితుడైన మంత్రి జగదీశ్రెడ్డి రెండు ఎన్నికల్లోనూ బొటాబొటి మెజార్టీతో గట్టెక్కగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి కొంత ప్రతికూలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన వట్టే జానయ్య బీఎస్పీ అభ్యర్థిగా నిలబడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఖరారుతో హస్తం పార్టీ విభేదాలు భగ్గుమన్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్రెడ్డి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
Telangana Assembly Elections 2023 : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. పటేల్ రమేశ్రెడ్డి, వట్టే జానయ్య, కమలం పార్టీ చీల్చే ఓట్లు గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది. కోదాడలో ద్విముఖ పోరు నెలకొంది. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి పద్మావతిరెడ్డి, జనసేన తరఫున సతీశ్రెడ్డి బరిలో ఉన్నారు. బీసీ నినాదంతో ప్రచారంలోకి వెళుతున్నా మల్లయ్య యాదవ్కి సోంత పార్టీ నేతలే సహకరించని పరిస్థితి నెలకొంది. కీలక నేతలు కాంగ్రెస్ పంచన చేరడం కొంత ప్రతికూలాంశం. కోదాడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హుజూర్నగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధికార పార్టీ, కాంగ్రెస్ నుంచి స్టార్ క్యాంపెయినర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ తరఫున శ్రీలతరెడ్డి ఎన్నికల్లో నిలపడ్డారు. పార్టీ సంక్షేమ పథకాలు, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారంలో సైదిరెడ్డి ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. ఉత్తమ్ స్కెచ్ వేస్తే.. ప్రత్యర్థి ఎంతటి వారైనా చిత్తవ్వాల్సిందే. నియోజకవర్గంలో విస్తతంగా తిరగకపోవడం, ఓట్లరని కలవలేకపోవటం ప్రతికూలాంశం.
Political Parties Strategy in Telangana : తుంగతుర్తిలో అధికార ప్రభుత్వ అభ్యర్థి గాదరి కిశోర్కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు, బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య బరిలో ఉన్నారు. రెండుసార్లు గెలిచిన కిషోర్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అభివృద్ధి చూసి ఓటర్లు మరోసారి ఆశీర్వదిస్తారని ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు ఉద్యమకారుడు. బీఆర్ఎస్లో సముచిత స్థానం లేదనే కారణంతో కాంగ్రెస్లో చేరారు. అద్దంకి దయాకర్ కలిసి పనిచేస్తామని చెప్పడం, గులాబీ పార్టీ వ్యతిరేకవర్గం కాంగ్రెస్లోకి రావడం కలిసొచ్చే అంశాలు.