షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య ఎలాంటి భేటీ లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ప్రణాళికలో లేవని పేర్కొంది.
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేక్లో ఈ నెల 13, 14 తేదీల్లో జరగబోయే ఎస్సీఓ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇరుదేశాల ప్రధానుల మధ్య సమావేశం ఉండనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ సమాధానమిచ్చారు.
" కిర్గిజిస్థాన్లో పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి పర్యటన వ్యక్తిగతం. భారత్కు చెందిన ఏ ఒక్క అధికారితో సమావేశానికి ప్రణాళిక లేదు. నాకు తెలిసినంత వరకు షాంఘై కోఆపరేషన్ సమ్మిట్లో భాగంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశం లేదు."
-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ ప్రతినిధి.
ఇదీ చూడండి: భాజపాలో 'నెం-2' అమిత్ షా యేనా?