ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య.. ప్రజలను కోరారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, నూతన విద్యుత్ విధానం రద్దు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ అపాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ...కడపలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీపు జాతర నిర్వహించారు. ఈ జాతర ద్వారా జిల్లాలోని 50 మండలాల్లో పర్యటించి బంద్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక రైతు రోడ్లపైకి వచ్చి స్వచ్చంధంగా బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
విశాఖ జిల్లాలో...
ఈ నెల 26 న భారత్ బంద్ సందర్భంగా విశాఖ జిల్లా ముంచంగిపట్టులో సీపీఎం నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయవద్దని, స్టీల్ ప్లాంట్ను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె. త్రినాథ్, ఎం ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో....
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థి సంఘాలు... సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని గళమెత్తారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మార్కెట్ మీదుగా మేదరి బంద వరకు ఈ ర్యాలీ సాగింది. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లో చూపించి కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విద్యావేత్తలు, మేధావులు ఆలోచించి విశాఖ ఉక్కు ఘటన పై మరింతగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలన్నారు.
ఇదీ చదవండి: