భాషే శ్వాసగా... అక్షరమే ఆయుధంగా..! విజయనగరం పట్టణానికి చెందిన కూరెళ్ల నాగభూషణరావు, శ్యామల దంపతుల ఏకైక కుమార్తె విశాలక్షీ శ్రీ శ్రేయ. శ్రేయను మొదటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదివించారు ఆమె తల్లిదండ్రులు. అయినా తెలుగుపై మమకారంతో భాష నేర్చుకుంది. తెలుగుపై పట్టు సాధించి... రచన దిశగా అడుగులు వేసింది. సామాజిక పరిస్థితులను ఎంచుకొని కవితలు రాయటం అలవాటు చేసుకుంది శ్రేయ. పాఠశాల స్థాయిలోనే రచనలు ప్రారంభించింది. తన తల్లి పాల్గొనే సాహితీ సభలు, కవి సమ్మేళనాలకు హాజరవుతూ... రచనాశైలికి మెరుగులు దిద్దుకుంది.
సాధారణంగా కవిత్వం రాయడానికి వయసుతో సంబంధం లేదు. సృజనాత్మకత సహజంగా రావాలి. ఆలోచన శక్తి అక్షరాల్లో ప్రతిబింబించాలి. శ్రేయ రచనా శైలిలో ఇవన్నీ ఉన్నాయి. సుకుమార భావాలను సున్నితంగా తడిమి... సుతిమెత్తని ఆలోచనలతో ఇప్పటి వరకు వివిధ సామాజిక అంశాలపై వందకుపైగా రచనలు చేసింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న శ్రేయ... ఆటబొమ్మల నుంచి ఉగాది పండుగ వరకు, నీళ్ల సీసాలు అమ్మే కుర్రాడి నుంచి... సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన సైనికుడి వరకు... అంతరించిపోతున్న మానవ సంబంధాలను తన కలంతో సమాజాన్ని తట్టిలేపుతోంది.
స్థానికంగా ఉపాధి లేక వలస వెళ్లే ఎందరినో చూసి... 'వలస' పేరుతో కవిత రాసింది. అమ్మ చెప్పిన ఉగాది గుర్తుగా 'మా ఇంటికి ఉగాది వచ్చింది', వేసవి కాలంలో తాను కోరుకున్న 'చిరు కోరికలన్నీ నెరవేరితే ఎంత బాగుటుందో' అని.... ఇలా సందర్భాన్ని బట్టి వందకుపైగా కవితలు రాసింది. వాటిలో 32 కవితలను... 'ఎంత బాగుంటుందో' పేరుతో కవితా సంకలనంగా సాహితీ స్రవంతి సంస్థ 2016లో పుస్తకం అచ్చువేసింది. సమాజంలోని రుగ్మతలు, సంఘటనల ఆధారంగానే రచనలు సాగిస్తున్నట్లు శ్రేయ చెబుతోంది. కూరెళ్ల శ్రీ శ్రేయ తన రచనలతో ఎన్నో ప్రసంశలు, అవార్డులు సొంతం చేసుకుంది. ఎందరో ప్రముఖ రచయితలచే శభాష్ అనిపించుకుంది.
ఇటీవల విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఈ యువ రచయిత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రేయకు రచనల్లోనే కాదు... సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. వయొలిన్లో పట్టు సాధించింది. తాజాగా వీణ వాయించటం నేర్చుకుంటోంది. సాహితీ సభలు, సమావేశాల్లో అప్పుడప్పుడు తన గాత్రం కూడా వినిపిస్తుంది. శ్రీ శ్రేయ రచనల పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన రచనలు, కవితల కంటే... శ్రేయ రచనలతోనే తనకు ఎక్కువ గుర్తింపు వచ్చిందని ఆమె తల్లి శ్యామల చెబుతున్నారు. సామాజిక స్పృహ ఉన్న రచనల దిశగా సాగడంతో చాలామంది పెద్దలు అభినందిస్తున్నారని శ్రేయ తండ్రి నాగభూషణరావు అంటున్నారు. రచన చేపట్టిన కూరెళ్ల విశాలక్షీ శ్రీ శ్రేయకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆకాంక్షిస్తూ... అభినందిద్దాం.