గడ్డిపోచలు అపురూపంగా ఏరుకొచ్చి చేత్తో ఓపిగ్గా పేనుతాడు ఓ పెద్దాయన. ఆయన పేరే మొవ్వా కృష్ణమూర్తి. వయసు 70 ఏళ్లపైమాటే. గడ్డిపోచలు పోగుచేసి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? వాటితో అందమైన చీర రూపొందిస్తాడు. ఆశ్చర్యంగా అనిపించినా.. ఆ చీర చూశాక ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు.
ఎలా అలవడిందంటే.?
ప్రకాశం జిల్లా పరుచూరు మండలం వీరన్నపాలెంలో ఉంటారు కృష్ణ మూర్తి. పొలం పనుల్లో సాయం కోసం 5వ తరగతిలోనే చదువు మాన్పించేశారు ఆయన తండ్రి. అలా చదువుకు దూరమై, పొలంబడిలో చేరాక ఈ సరికొత్త విద్య నేర్చుకున్నారు కృష్ణమూర్తి. పశువుల కోసం తాళ్ల పేనడంతో మొదలై.. క్రమంగా గడ్డితో తాళ్లు, చర్నాకోలు చేయడంపై పట్టు సాధించారు. ఆ కళతోనే ఏడు పదుల వయసులోనూ ఆరు గజాల చీర సృష్టిస్తూ అబ్బుర పరుస్తున్నారు.
'36 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పుతో ముందుగా ఓ వస్త్రం తయారు చేశాను గడ్డితో. కానీ.. అది జనం దృష్టిలో పడలేదు. అప్పుడు కాస్త పెద్దది తయారుచేయమని అప్పటి కలెక్టర్ సలహా ఇచ్చారు. 40 అంగుళాల పొడవు, 20 అంగుళాల వెడల్పుతో వరిగడ్డితో కండువా నేశాను.
- మొవ్వా కృష్ణమూర్తి, గడ్డిచీర సృష్టికర్త
ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు..
భారతదేశ నైపుణ్యాలను ప్రపంచానికి తెలియజెప్పడమే తన ఉద్దేశమంటారు కృష్ణమూర్తి. గడ్డి అల్లికలపై ప్రయోగాలు చేస్తూ.. ముందుగా కండువా రూపొందించారు. అంతటితో ప్రయోగాలు ఆపకుండా చీర తయారుచేసి, అందరి దృష్టి ఆకర్షించారు. ఈ చీరపై ఎన్నో ప్రదర్శనల్లో ప్రముఖల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.
'వరిగడ్డితో 6 గజాల చీర నేశాను. దానిమీదకు రవిక కూడా కుట్టు లేకుండా తయారుచేశాను. హ్యాండ్ బ్యాగులు సహా.. అనేక రకాల వస్తువులు చేసి, చాలా అవార్డులే గెలుచుకున్నా. రాష్ట్రపతికి 125 గ్రాముల బరువున్న శాలువా కప్పాను. ఆయన నాకు అవార్డు ప్రదానం చేశారు.'
- మొవ్వా కృష్ణమూర్తి, గడ్డిచీర సృష్టికర్త
శ్రమ తప్ప.. ఖర్చులేదు..
ముందుగా.. గడ్డిని నీటిలో నానబెడతారు. మెత్తబడిన గడ్డిని, సన్నని దారంగా పేనుతారు. ఆ దారం స్వయంగా తయారు చేసుకున్న మగ్గంలాంటి ఫ్రేమ్లో అల్లుతారు. చీర అంచులకు మాత్రం మామూలు దారమే వినియోగిస్తారు. ఇలా తయారైన వస్త్రం ఎన్నేళ్లైనా చెక్కుచెదరదు. ఉతికితే.. నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది. కృష్ణమూర్తి పేనిన చీరకు శ్రమ తప్ప, రూపాయి ఖర్చు ఉండదు. మన దేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఈ చీర మెప్పు పొందింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టింది.
'భారతదేశాన్ని బ్రిటిషర్లు పాలించే సమయంలో.. ఓ వ్యక్తి అగ్గిపెట్టెలో పట్టే చీర నేశాడు. అంత మేధావి ఈ దేశంలో ఉండకూడదన్న అక్కసుతో ఆయన చేతులు నరికేసి, మగ్గం జోలికి పోకుండా చేశారు బ్రిటిషర్లు. అది నేను విన్నాను. భారతదేశంలో గొప్ప కళాకారులున్నారని ఇతర దేశాల వారికి చూపించాలన్న పట్టుదలతో ఇవి తయారుచేశాను.' అని చెబుతాడు కృష్ణమూర్తి.
ఇదీ చదవండి: 'రోష్ణీ'.. ఆ విభాగానికే బ్రాండ్ అంబాసిడర్గా..